ఇప్పుడు విపక్షం వీరు కాదటగా ?

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి తప్ప హైదరాబాద్ ను వీడి అమరావతి మొహం చూడటం లేదు. చినబాబు [more]

Update: 2020-08-19 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి తప్ప హైదరాబాద్ ను వీడి అమరావతి మొహం చూడటం లేదు. చినబాబు లోకేష్ అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో శ్రీకాకుళం వెళ్ళి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి వచ్చారే తప్ప క్షేత్ర స్థాయిలోకి దిగింది లేదు. వాస్తవానికి లోకేష్ ధైర్యంగా ప్రజల్లో తిరిగే వయస్సే కానీ ఆయన ధైర్యం చేయడం లేదన్న విమర్శలు ఆ పార్టీలో అంతర్లీనంగా వినవస్తున్నాయి. చంద్రబాబు జూమ్ కెమెరాతో లోకేష్ ట్విట్టర్ రాజకీయాల్లో తప్ప ఎక్కడా జాడే లేదు. కరోనా కారణంగా వీరిద్దరూ అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయారు.

బాగా యాక్టివ్ అయిన బిజెపి …

ఈ నేపథ్యంలో అదనుకోసం వేచి చూస్తున్న బిజెపి మాత్రం తన దూకుడు బాగా పెంచేసింది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. తాజాగా కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా బిజెపి క్షేత్ర స్థాయికి వెళ్ళిపోతుంది. విజయవాడ లో రమేష్ ఆసుపత్రిలో దుర్ఘటన చోటు చేసుకున్నప్పుడు తొలిగా సంఘటన స్థలానికి సోము వెళ్ళి వచ్చారు. ఆ తరువాత టిడిపి నేతలు కొందరు వెళ్ళినా చంద్రబాబు, లోకేష్ వంటి వారు వెళితే వచ్చే ఫోకస్ వీరికి దక్కలేదు. అలాగే గోదావరి వరదల పరిస్థితిని అంచనా వేసి బాధితుల తరపున సోము వీర్రాజు గళం విప్పింది పరిశీలిస్తే టిడిపి చేయాలిసిన పనిని బిజెపి పూర్తి చేస్తున్నట్లే కనిపిస్తుంది. వయస్సు రీత్యా బిజెపి ఎపి చీఫ్ సోము వీర్రాజు సైతం 60 ప్లస్ నే. కానీ ఆయన ధైర్యంగానే క్షేత్ర స్థాయిలో సీన్ లోకి ఎంటర్ అయిపోతున్నారు.

అప్పుడే చెప్పేశారు …

సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం నాడే బిజెపి జాతీయ నాయకులు రామ్ మాధవ్ ఏపీ లో ప్రతిపక్షంలో బాగా వ్యాక్యూమ్ ఉందని ప్రకటించారు. దాన్ని భర్తీ చేయడానికి దూకుడుగా వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఆయన చెప్పినట్లే టిడిపి కీలక అంశాల్లో ఆ పార్టీ అగ్రనేతలైన చంద్రబాబు, లోకేష్ లను బాగా మిస్ అయిపోతూ వస్తుంది. పంద్రా ఆగస్టు నాడు కనీసం జండా ఎగురవేయలేని పిరికితనం టిడిపి నేతలదంటూ అంబటి రాంబాబు వంటి అధికారపార్టీ కి చెందిన వారు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నా దీనిపై జవాబు చెప్పేవారే లేరు. కరోనా ఇంకొంత కాలం ఇలాగే కొనసాగి ఏదో ఒక సంఘటన ఎపి లో జరుగుతున్నప్పుడు టిడిపి అటెండెన్స్ ఇలానే ఉంటె ప్రజల్లో అభాసుపాలు అవుతామని ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే వయోభారం రీత్యా చంద్రబాబు ముఖ్యమైన కార్యక్రమాల్లో అటెండ్ కాలేక పోయినా చినబాబు కి ఏమైందన్న ప్రశ్నకు తెలుగుదేశం నుంచి సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఇంకెన్నాళ్లో.

Tags:    

Similar News