బాబు రంగంలోకి దిగిపోయారు … తమ్ముళ్ళ లో జోష్

ఘోరమైన తీరులో అధికారం కోల్పోవడంతో టిడిపి నేతలు కార్యకర్తలు బాగా ఢీలా పడ్డారు. ఓటమికి తోడు పార్టీ ఫిరాయింపుల కు నేతలు పాల్పడుతూ ఉండటం తో మరింత [more]

Update: 2019-06-26 05:33 GMT

ఘోరమైన తీరులో అధికారం కోల్పోవడంతో టిడిపి నేతలు కార్యకర్తలు బాగా ఢీలా పడ్డారు. ఓటమికి తోడు పార్టీ ఫిరాయింపుల కు నేతలు పాల్పడుతూ ఉండటం తో మరింత బిక్కచచ్చిపోతుంది విపక్ష పార్టీ. మరోపక్క ఇంటా బయటా అన్న విధంగా అటు అసెంబ్లీ ఇటు పబ్లిక్ లోను టిడిపి చేసిన తప్పులను కడిగిపారేస్తూ వైసిపి దూసుకుపోతుంది. దాంతో ఈ వత్తిడి నుంచి కొంత రిలీఫ్ పొందాలని యూరప్ టూర్ కి వెళ్లిపోయారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన ఇలా వెళ్ళారో లేదో మరింత వేగంగా పార్టీ పరిస్థితి ఆందోళనలో పడింది. నలుగురు ఎంపిలు బిజెపి కండువా కప్పేసుకుని మాజీ సిఎం యూరప్ లో అడుగుపెట్టిన వెంటనే షాక్ ఇచ్చారు చంద్రబాబు కు. ఆయన వచ్చేలోగా విపక్ష హోదా కూడా లేకుండా కొందరు ఎమ్యెల్యేలు గోడదూకేస్తారన్న వార్తలు పసుపు దళంలో మరింత ఆందోళన పెంచాయి. ముఖ్యంగా పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్యెల్యేలు కూటమి నిర్వహించి ఉండాలో పోవాలో అన్న ఆలోచనకు దిగాయి. ఇది మరో సంక్షోభానికి తెరతీసింది. ఇవన్నీ ఇలా ఉంటే బాబు ముచ్చట పడి కట్టించుకున్న ప్రజావేదిక ను అక్రమ కట్టడం అంటూ రాత్రికి రాత్రే కూల్చేసింది. ఇది టిడిపికి మరో షాక్ ను ఇచ్చింది.

బాబు వచ్చేశారు …

ఇన్ని పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హుటాహుటిన అమరావతి రావాల్సి వచ్చింది. ఆయనకు గతంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా లేని స్వాగతాన్ని తమ్ముళ్ళు విమానాశ్రయంలో ఇవ్వడం గమనిస్తే ఎదో జరగబోతుందన్న సంకేతాలు స్పష్టం అయ్యాయి. ప్రజా వేదిక కూల్చివేత నేపథ్యంలో అర్ధరాత్రి చంద్రబాబు సారధ్యంలో టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగుతారన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుకున్న సమయానికి చంద్రబాబు నాయుడు విమానం నుంచి దిగిపోయారు. వెంటనే తమ్ముళ్ళ లో జోష్ పెరిగింది. మా నాయకుడికి ప్రభుత్వ సెక్యూరిటీ అవసరం లేదంటూ నినాదాలు మొదలు పెట్టేశారు. ఆ తరువాత ముఖ్య నేతలతో చర్చించి సమీక్షించిన బాబు ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం అప్పటికే అర్ధరాత్రి హై కోర్ట్ లో విచారణ వున్న నేపథ్యంలో ఆందోళన చేపట్టడం సరికాదని డిసైడ్ చేశారు. కోర్ట్ చెప్పే అంశాన్ని బట్టి తదుపరి కార్యాచరణ సిద్ధం చేద్దామని మౌనం గా నిష్క్రమించారు. వేదిక అక్రమ కట్టడం కావడంతో దీనిపై ఆచితూచి అడుగులు వేయాలని బాబు నిర్ణయించడంతో ఘర్షణ వాతావరణానికి తెరపడింది.

అర్ధరాత్రి హై డ్రామా తరువాత ...

ఇక అర్ధరాత్రి వేగవంతంగా ప్రజా వేదిక కూల్చివేత నడిచింది. హౌస్ మోషన్ పిటిషన్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చేందుకు కోర్ట్ అంగీకరించలేదు. రెండు వారాల తరువాత విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది. ఈ నిర్ణయం టిడిపి కి గట్టి షాక్ ఇచ్చింది. మరోపక్క ప్రజావేదిక కూల్చివేత నిరాటంకంగా కొనసాగుతూ ఉండగానే ఇల్లు చేరిపోయారు చంద్రబాబు నాయుడు.

కిమ్ కర్తవ్యం ….

పార్టీని కాపాడుకోవడం, ప్రజల్లో పోయిన పరువు నిలబెట్టుకోవడం చంద్రబాబు పై ప్రస్తుతం వున్న లక్ష్యాలు. అందుకోసం ఆయన కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికిప్పుడు పోరాటాలు చేద్దామన్నా వైసిపి తమ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను తవ్వి తీస్తుంది. గత ప్రభుత్వంలో చట్టాలకు తూట్లు పొడిచిన వైనాన్ని ప్రజల ముందు పెడుతూ వెళుతుంది. దాంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వెతుక్కునే పనిలో పడ్డారు. మరి అయన తాజా వ్యూహం ఎలా ఉండబోతుందా అని తమ్ముళ్ళే కాదు అంతా ఎదురు చూస్తున్నారు

Tags:    

Similar News