నవ్వాలా? ఏడవాలా?

సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. నవ్వాలో? ఏడవాలో కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి చేజారి [more]

Update: 2020-02-14 13:30 GMT

సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. నవ్వాలో? ఏడవాలో కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి చేజారి పోతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. నిజానికి చల్లా రామకృష్ణారెడ్డి సుదీర్ఘకాలంగా ఆశిస్తున్న ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పట్టుమని నాలుగు నెలలు కూడా పదవి లేకపోవడంతో జగన్ నిర్ణయాన్ని ఇటు తప్పుపట్టలేక అటు అవుననలేక ఇబ్బంది పడుతున్నారు.

ఎన్నికలకు ముందు చేరి….

నిజానికి చల్లా రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బనగానపల్లె నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం చల్లా రామకృష్ణారెడ్డిని పార్టీలో జగన్ చేర్చుకున్నారు. చేరిక సమయంలోనే జగన్ ఆయనకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

ఎంతో మంది ఉన్నా…..

చల్లా రామకృష్ణారెడ్డి కంటే ముందునుంచి అనేక మంది సీనియర్ నేతలు ఈ పదవి కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచే ఎక్కువ పోటీ ఉంది. అంతేకాదు రాయలసీమ ప్రాంతం నుంచి జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయినా ఎవరికీ ఇవ్వకుండా జగన్ తాను ఇచ్చిన మాట ప్రకారం చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సీమ, రెడ్డి కోటాలో ఆయనకు ఈ పదవి లభించింది.

కిం కర్తవ్యం?

టీడీపీలో ఎక్కువ కాలం ఉన్నా ఆయనకు పదవి దక్కలేదు. వైసీపీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడంతో చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యారు. అయితే పదవి వచ్చిన నాలుగు నెలలకే శాసనమండలి రద్దయింది. దీంతో తనతో పాటు తన కుమారుడు చల్లా భగీరధరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆయనలో ఆందోళన మొదలయిందంటున్నారు. అందుకే ఆయన శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదనపై పెదవి విప్పడం లేదంటున్నారు. మొత్తం చల్లా రామకృష్ణారెడ్డి ఆనందం నాలుగు నెలలకే జగన్ పరిమితం చేసినట్లయింది.

Tags:    

Similar News