ఏపీ కేరాఫ్ హైదరాబాద్…. ?

విభజన ఏడేళ్ల క్రితం జరిగింది. ఇంకా విభజన గాయాలు అలాగే ఉన్నాయి. తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుకూ నీటి తగాదాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా [more]

Update: 2021-09-10 11:00 GMT

విభజన ఏడేళ్ల క్రితం జరిగింది. ఇంకా విభజన గాయాలు అలాగే ఉన్నాయి. తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుకూ నీటి తగాదాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికీ రాజధాని లేదు అన్న విమర్శలు వెక్కిరింపులు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని మనదని చెప్పేవారు. అయితే అది ఎంతవరకూ పూర్తి అయిందో ఎవరికీ తెలియదు కానీ ఒక చిరునామా అంటూ నాడు ఉండేది. ఇపుడు జగన్ సర్కార్ మూడు రాజధానుల పుణ్యమాని ఏపీకి క్యాపిటల్ ఎక్కడ అని విద్యార్ధుల నుంచి మేధావుల వరకూ మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉంది.

గుర్తించడం లేదా…?

మరో వైపు చూస్తే కేంద్రం కూడా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించడం లేదా అన్న చర్చ అయితే వస్తోంది. దానికి సంబంధించి చూస్తే కొన్ని ఉదాహరణలు కళ్ళకు కనిపిస్తున్నాయి. కేంద్రంతో వివిధ అంశాల మీద ప్రతీ రోజూ కరస్పాండెన్స్ చేస్తున్న ఏపీ అధికారులకు ఢిల్లీ నుంచి వస్తున్న జవాబుల్లో ఏపీ రాజధానిగా హైదరాబాద్ నే పేర్కోనడం విశేషం. అప్పటికీ ఏపీ అధికారులు అమరావతి పేరు మీదనే లేఖలు రాస్తున్నారుట. మరి ఈ చిత్రమేంటో వారికే అర్ధం కావడంలేదుట. ఈ మధ్యనే ఆర్టీఐ కింద ఒక సమాచారం కోసం ఏపీకి చెందిన ఒక వ్యక్తి కేంద్రంలోని కీలకమైన శాఖకు లేఖ రాస్తే ఆయనకు కూడా హైదరాబాద్ పేరు మీదనే జవాబు వచ్చిందట.

టెక్నికల్ గా అంతేనా…?

ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది అధికారుల స్థాయిలోనూ చర్చగానే ఉంది. అయితే టెక్నికల్ గా చూస్తే విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణాలకు కలిపి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. అది 2024 దాకా ఉంది. మధ్యలో ఏపీకి పాలకులు వచ్చినా అమరావతి రాజధాని అన్నా కూడా హైదరాబాద్ నే ఇంకా గుర్తించడానికి అదొక రీజన్ అంటున్నారు. మరో వైపు చూస్తే అమరావతిని భారత దేశం పొలిటికల్ మ్యాప్ లో పెట్టించామని గర్వంగా టీడీపీ ఎంపీ ఆ మధ్య చెప్పుకున్నారు. కానీ కేంద్రం మాత్రం అమరావతిని పట్టించుకోవడంలేదులాగానే ఉందిట.

మంచికేనా…?

ఈ పరిణామాలు టీడీపీ నేతల్లో కలవరం రేపుతుండగా వైసీపీ మాత్రం హ్యాపీ ఫీల్ అవుతోందిట. మూడు రాజధానులకు కేంద్రం మద్దతుగా ఉందని, త్వరలో తమ కల సాకారం అవుతుంది అని వారు తెగ సంబర పడుతున్నారు. కర్నూలు కి హై కోర్టు ని తరలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న మరు క్షణం జగన్ విశాఖకు పాలన మారుస్తారని కూడా నిబ్బరంగా చెబుతున్నారు. అయితే అధికారుల స్థాయిలో జరిగే కరస్పాండెన్స్ ని పట్టుకుని కేంద్రం మద్దతు అంటూ అపుడే ఒక నిర్ణయానికి రావడం కూడా మంచిది కాదు అన్న మాటా ఉంది. ఏదీ ఏమైనా ఏపీ వాసులలో మెజారిటీ ప్రజలు ఇప్పటికీ తమ రాజధాని హైదరాబాదే అని భావిస్తున్నారు. కేంద్రం వైఖరి కూడా అలాగే ఉంది. ఇంతకీ ఏపీకి సరైన రాజధాని లేదు కాబట్టే ఇలా జరుగుతోంది అంటున్నారు.

Tags:    

Similar News