బీహార్ లో ఎన్నికలు జరగుతాయ్.. కాని ఎప్పటిలా కాదు

కరోనా వైరస్ ఇప్పట్లో భారత్ ను వదిలిపెట్టేలా లేదు. ఇప్పటికే ఏడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో ఈ కేసుల సంఖ్య [more]

Update: 2020-07-11 18:29 GMT

కరోనా వైరస్ ఇప్పట్లో భారత్ ను వదిలిపెట్టేలా లేదు. ఇప్పటికే ఏడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రాష్ట్రమూ కరోనా బారిన పడి విలవిలలాడి పోనుంది. సెప్బంబరు చివరి నాటికి ఈ కేసుల సంఖ్య కోటి వరకూ చేరుకోవచ్చన్నది కూడా అధ్యయన సంస్థల అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వాయిదా వేసే అవకాశం లేక…..

మామూలు ఎన్నికలయితే వాయిదా వేసే వీలుంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి ఎన్నికలను వాయిదా వేయవచ్చు. ఈ ఎన్నికల్లో పరిమిత సంఖ్యలోనే పాల్గొంటారు. అయితే శాసనసభ ఎన్నికల పరిస్థితి అలా ఉండదు. శాసనసభ సమయం పూర్తయ్యేలోపు విధిగా ఎన్నికలు జరపాలి. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యత. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

అతి పెద్ద రాష్ట్రం….

బీహార్ అతి పెద్ద రాష్ట్రం. యూపీ, మహారాష్ట్ర తర్వాత అతి పెద్ద రాష్ట్రం బీహార్. ఇక్కడ 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. వలస కార్మికుల రాకతో ఇటీవల బీహార్ లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగింది. మరణాలు కూడా బాగా పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటింగ్ లో ఎలా పాల్గొంటారన్న దానిపై నిన్నటి వరకూ సందిగ్దం నెలకొంది. ఎన్నికలయితే షెడ్యూల్ ప్రకారమే జరగాల్సి ఉంది. కానీ ఈసారి ఎన్నికల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.

పోస్టల్ బ్యాలెట్లు… పోలింగ్ కేంద్రాలు…

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకిన వారు, ఐసోలేషన్ లో ఉన్నవారికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇచ్చింది. వీరు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వీలు కల్పించింది. ప్రభుత్వోద్యోగులకే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వీరికి కూడా కల్పించారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఎక్కువ స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలింగ్ సమయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లతో పోలింగ్ ను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అయిపోయింది.

Tags:    

Similar News