వైరస్ భయంతో అంతా ఖాళీ … ఆ ఒక్కటి తప్ప?

కేంద్రం ఆంక్షలు ఎత్తేసినా ప్రార్ధన మందిరాలు మాల్స్ లో, మాత్రం జన సందడి లేకుండా పోయింది. వైరస్ భయం తో ప్రజలు వీటికి దూరంగా ఉండటానికే చూస్తున్నారు. [more]

Update: 2020-06-10 09:30 GMT

కేంద్రం ఆంక్షలు ఎత్తేసినా ప్రార్ధన మందిరాలు మాల్స్ లో, మాత్రం జన సందడి లేకుండా పోయింది. వైరస్ భయం తో ప్రజలు వీటికి దూరంగా ఉండటానికే చూస్తున్నారు. అదేవిధంగా బస్సులు సగమే తిప్పుతూ అందులో కూడా సగం సీట్లే ఆర్టీసీ భర్తీ చేస్తున్నా వాటిలో ప్రయాణం చేయడానికి చాలామంది ఆసక్తి చూపడంలేదు. దాంతో చాలావరకు ఖాళీ సీట్లే కనిపిస్తున్నాయి. సొంత వాహనాల్లో అత్యవసరం అయితేనే ప్రయాణం చేస్తున్నారు ప్రజలు.

అంతా గోవిందా గోవిందా …?

రంజాన్ సమయంలో ఒక మీడియం స్థాయి మసీదుకు ఆదాయం ఐదు నుంచి పదిలక్షల రూపాయలు భక్తులు ఇచ్చేవారు. అందులోనే ఇఫ్తార్ తదితర ఖర్చులకు ఆ డబ్బును మసీదు కమిటీలు వినియోగించేవి.అయితే లాక్ డౌన్ ప్రభావంతో అది ఇప్పుడు 25 వేలరూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. మసీదులకు గతంలో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేవారు వ్యాపారాలు, పనులు బంద్ కావడంతో ఆదాయం కోల్పోయి డీలా పడ్డారు. దాంతో ముందు కుటుంబ పోషణకు ప్రాధాన్యత ఇస్తూ దేవుడి సంగతి పక్కన పెట్టేశారు.

హిందూ దేవాలయాలు అంతే ..

అదేవిధంగా హిందూ దేవాలయాల పరిస్థితి అత్యంత దీనంగా మారిపోయింది. తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ద్వారకా తిరుమల ఆలయంలో షాప్ లు నిర్వహించేవారు పాలకమండలి కి తమ ధరావత్తు సొమ్ము వెనక్కు ఇచ్చేయాలని అర్జీ పెట్టుకున్నారు. ఇలా 80 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం గమనిస్తే ఆలయ ప్రాంతాల్లో మరో ఏడాది వరకు తమ వ్యాపారాలు పెద్దగా ఉండవని భావించే వారు ఈ విధంగా వ్యాపారాలు వదులుకునేందుకు సైతం సిద్ధం అయినట్లు స్పష్టం అవుతుంది.

చర్చి ల్లోనూ అంతే …

చర్చి ల్లో సైతం కనివినిఎరుగని స్థాయికి ఆదాయం పడిపోయింది. కనీసం ప్రార్ధనాలయాల నిర్వహణ ఖర్చులు సైతం ఖజానాలో దాచిన సొమ్ము తెచ్చి ఖర్చు పెట్టె పరిస్థితి. భక్తులు ఆన్లైన్ లో ఫోన్ పే గూగుల్ పే ద్వారా కానుకలు సమర్పించుకోవాలంటూ ఫాస్టర్ లు కొన్ని చోట్ల ప్రచారం కూడా మొదలు పెట్టేయడం గమనిస్తే కరోనా వీరి జీవితాలను కల్లోలం చేసినట్లు స్పష్టం గా కనిపిస్తుంది. ఇక చిన్న చిన్న ప్రార్ధనాలయాలు ఆయా మత పూజారులకు జీతభత్యాలు కూడా సమకూర్చుకోలేని స్థితికి జారిపోయాయి.

ఇప్పట్లో కోలుకోలేవు …

తిరుమల వంటి ఆలయాలు తప్ప ఇప్పుడు ప్రార్ధనాలయాలకు అత్యంత గడ్డుకాలమే ఇక ముందు కొనసాగవచ్చని నిపుణులు అంటున్నారు. బస్సులు, రైళ్ళు, విమానాలు ప్రస్తుతానికి అరకొరగా మాత్రమే తిరుగుతున్నాయి. ప్రజా రవాణా పూర్తిస్థాయిలో తిరిగినప్పుడే ప్రార్ధనాలయాలకు పూర్వవైభవం సంతరించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు భారత్ లో వైరస్ తీవ్రత పెరుగుతూ వెళుతుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో అప్పటివరకు సమూహాలు గా ఉండే ప్రాంతాలకు ప్రజలు వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది.

రెస్టారెంట్స్ లో మాత్రం …

అయితే రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్ లో ఉండే ఫుడ్ ఐటమ్స్ కి మాత్రం బాగానే గిరాకీ ఉండటం విశేషం. ఇంట్లో తిని తిని నాలిక కొత్త రుచులకు తహ తహ లాడటంతో ఇప్పుడు జనం మాత్రం ఫుడ్ ఐటమ్స్ కి గతంలోలాగే క్యూ కట్టారు. లాక్ డౌన్ లో ఉన్నప్పుడే కూర్చుని తినేందుకు కాకుండా పార్సిల్స్ కి అనుమతి ఇవ్వడంతో అంతా హోటల్ ఫుడ్ కొనసాగిస్తూనే ఉన్నారు. చాలా మంది పార్సిల్స్ అలాగే సిట్టింగ్స్ కి భయం లేకుండానే వెళుతున్నారు. ఇదొక్కటే కొంత ఆయా యజమానులకు ఆనందం కలిగిస్తున్నా వీరికి కార్మికుల సమస్య వెంటాడుతుంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చెఫ్ ల నుంచి క్లిన్ చేసే కార్మికుల వరకు సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో చాలా చోట్ల సిబ్బంది లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు తిరిగి వచ్చేవరకు ఈ కష్టాలు వారికి తీరేలా లేవు.

Tags:    

Similar News