Jc brothers : జేసీ …. ఎవరి అవసరం ఎవరికి?

జేసీ బ్రదర్స్ సైలెంట్ అయ్యారు. గత కొద్దిరోజులుగా వారు పార్టీ విషయాలను కూడా పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై వారు గుర్రుగా ఉన్నారు. గత కొద్ది [more]

Update: 2021-10-28 12:30 GMT

జేసీ బ్రదర్స్ సైలెంట్ అయ్యారు. గత కొద్దిరోజులుగా వారు పార్టీ విషయాలను కూడా పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై వారు గుర్రుగా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి జేసీ దివాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మౌనంగానే ఉంటున్నారు. చంద్రబాబు 36 గంటల దీక్షకు అందరు నేతలు వచ్చినా వారు మాత్రం తాడిపత్రి నుంచి కదలలేదు. దీనిపై పార్టీలోనే చర్చ జరుగుతుంది.

పార్టీ నేతలతో….

జేసీ బ్రదర్స్ పార్టీకి అవసరం. వారికి కూడా ఏదో ఒక పార్టీ జెండా అవసరం. అంతే తప్ప తెలుగుదేశం మాత్రమే తమను గెలిపిస్తుందన్నది కాదు. వ్యక్తిగతంగా వారికున్న బలంతోనే ఇప్పటి వరకూ ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ చివరకు తాడిపత్రి మున్సిపాలిటిని నిలుపుకుని తమ పట్టు కోల్పోలేదని నిరూపించుకున్నారు. అయితే అనంతపురం టీడీపీ నేతల వ్యవహార శైలి పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారు.

ఆంక్షలు విధించడంతో….

కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధరెడ్డి, ప్రభాకర్ చౌదరి, పరిటాల సునీత.. ఇలా ముఖ్యమైన నేతలు అందరూ జేసీ సోదరులను వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు సయితం ఇంత మంది నేతలను కాదనలేక, జేసీ సోదరులకు చెప్పలేక నలిగిపోతున్నారు. మూడు, నాలుగు నియోజకవర్గాల్లో తమ పెత్తనం చెల్లాల్సిందేనంటూ జేసీ బ్రదర్స్ డిమాండ్. కానీ చంద్రబాబు ఇందుకు అంగీకరించడం లేదు. పైగా తమపైనే పార్టీ ఆంక్షలను విధించడాన్ని కూడా సహించలేక పోతున్నారు. అందుకే వారు అలకబూనినట్లు చెబుతున్నారు.

దాడులు జరిగినా…?

రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడులు జరిగినా జేసీ బ్రదర్స్ స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు పార్టీ కార్యాలయానికి తరలి వచ్చినా వారు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. చంద్రబాబు వద్దకు వెళ్లి అలుసు కావడం కంటే, తమ అవసరం పార్టీకి పడినప్పడు తేల్చుకోవాలని జేసీ బ్రదర్స్ అనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే కొంతకాలం దూరంగా ఉండాలని, పార్టీతోనూ గ్యాప్ మెయిన్ టెయిన్ చేయాలని జేసీ బ్రదర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News