ఆగస్ట్ గండం పొంచి ఉందా… ?

తెలుగు రాజకీయాల‌లో ఆగస్ట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాజకీయాల్లో పెను సంక్షోభాలకు తెర తీసిన నెలగా దీన్ని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు సినీ వల్లభుడు ఎన్టీఆర్ [more]

Update: 2021-07-30 08:00 GMT

తెలుగు రాజకీయాల‌లో ఆగస్ట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాజకీయాల్లో పెను సంక్షోభాలకు తెర తీసిన నెలగా దీన్ని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు సినీ వల్లభుడు ఎన్టీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి ఈ ఆగస్ట్ నెల చాలా చేసింది. 1984లో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ని తొలి వెన్నుపోటు రుచి చూపిస్తే నాడు తన చాణక్యంతో ఆదుకున్న చంద్రబాబు 1995 ఆగస్ట్ లో అదే వ్యూహాలతో మామను పదవి నుంచి పడదోసి పీఠమెక్కారు. ఇక చాలా మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల జీవితాల్లో కూడా ఆగస్ట్ భయాలు ఉన్నాయి. అంతే కాదు, చంద్రబాబు కూడా తన మొత్తం పాలనలో ఎక్కువగా బెదిరింది ఆగస్ట్ నెల గురించే.

సీబీఐ జోరు…

ఇక విషయానికి వస్తే జగన్ మీద అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి విదితమే. కేసులు పెట్టి పుష్కర కాలం అయింది. సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ప్రజా ప్రతినిధుల కేసులు త్వరగా పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ కూడా జోరందుకుంది. ఆగస్ట్ నెల నుంచి కీలకమైన పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకోనున్నాయి అంటున్నారు. వీటి విచారణ కూడా వేగం పుంజుకుంటుందని చెబుతున్నారు. అంటే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ముఖ్యమైన కేసుల తుది విచారణ చేపడతారు అంటున్నారు. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు ఆగస్టు 25వ తేదీన వెల్లడి కానుంది.

రాజకీయ దుమారం …

మరో వైపు రోజురోజుకూ రాజకీయాల్లో కూడా దుమారం రేగుతోంది. జగన్ కేంద్రం తో పోరాటం చేస్తున్నారు. మరో వైపు ఏపీలోని విపక్షాలు అన్నీ కూడా కట్టుగా జగన్ ని టార్గెట్ చేస్తున్నాయి. ఇంకో వైపు సొంత పార్టీలోనే అసంతృప్తి పెరిగిపోతోంది. వీటితో పాటు ఆర్ధికపరమైన చిక్కులు కూడా ఏ నెలకు ఆ నెల పెరిగిపోతున్నాయి. దాంతో ఆగస్ట్ నెలలో ఇవన్నీ కూడి మరీ జగన్ సర్కార్ కి ఇబ్బందిని పెట్టే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. మరో వైపు మూడు రాజధానుల మీద విచారణ కూడా ఇదే నెలలో జోరందుకుంటుంది అంటున్నారు. దాని ఫలితం ఎలా వస్తుందో అన్న టెన్షన్ కూడా జగన్ లో ఉందిట.

తొలి నిరసన …

మరో వైపు చూస్తే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం వద్దు అంటూ ఉద్యోగులు తొలిసారిగా పోరు బాట పట్టనున్నారు. అంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల తొలి నిరసన అన్న మాట. ఇప్పటిదాకా తాము వేచి చూశామని కానీ సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం కనీసంగా స్పందించడంలేదని వారు అంటున్నారు. దాంతో తాము ఉద్యమించక తప్పదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ వర్గాలు కనుక రోడ్డు మీదకు వస్తే ఆ ఒక్క డిమాండ్ తో ఆగదు అంటున్నారు. చాలా విషయాలే బయటకు వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి జగన్ కి ఆగస్ట్ నెలలో ఇలాంటి గండాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News