ఏపీ పై సీబీ “ఐ”… ఎందుకిలా…?

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కేసులు ఎక్కువయిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కేసులు సీీబీఐ చేతుల్లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వం సీబీఐని [more]

Update: 2020-09-11 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కేసులు ఎక్కువయిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కేసులు సీీబీఐ చేతుల్లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడం, ఈ ప్రభుత్వం ప్రతి కేసును సీబీఐకి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీబీఐ కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్నాయి.

నాడు సీబీఐని వద్దని…..

గతంలో చంద్రబాబు సీబీఐ స‌హా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు ఏపీలోకి అడుగు పెట్టాలంటే ప్రభుత్వ అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేలా పాత చ‌ట్టాన్ని తిర‌గ‌దోడారు. ఫ‌లితంగా సీబీఐ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు స్వతంత్రించి ఏపీలోకి అడుగు పెట్టలేని ప‌రిస్థితి ఏర్పడింది. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ నేతలను వేధించకుండా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ తో సహా అన్ని దర్యాప్తు సంస్థలకు స్వాగతం చెప్పారు.

ముఖ్యమైన కేసులన్నీ…..

ప్రధానమైన కేసులన్నీ సీబీఐకి ఏపీ ముఖ్యమత్రి జగన్ అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో సీబీఐ అనేక కేసులు విచారిస్తుంది. హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తుంది. ఈ కేసు హైకోర్టు సూచనతో సీబీఐ విచారణను చేపట్టింది. అలాగే తెలుగుదేశం పార్టీ నేత యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసు విచారణ కూడా జరగుతుంది. ఇక కర్నూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసును కూడా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వమే నేరుగా……

ఇక విశాఖ డాక్టర్ సుధాకర్ పై పోలీసుల వేధింపు కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఆవభూముల కొనుగోళ్లపై కూడా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక తాజాగా అంతర్వేది లో రధం దగ్దం ఘటనను సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇలా ఏ రాష్ట్రంలో లేని విధంగా సీబీఐ అనేక కేసులను విచారించడం చర్చనీయాంశమైంది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో విచారణను కాదని సీబీఐకి అప్పగించడం అరుదుగా జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణకే ఎక్కువగా మొగ్గు చూపుతుంది. విపక్షాలు సయితం సీీబీఐ విచారణనే కోరుతున్నాయి. అయితే సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం కోల్పోతున్నామన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దేనికీ తలొగ్గని జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారంటే… ఆయన అంతర్వేది ఘటన విషయంలో కొంత భయపడినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే ఈకేసుల్లో విచారణ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సీబీఐ విచారణ అంటే ఏళ్ల తరబడి కొనసాగుతుందన్న కామెంట్స్ కూడా లేకపోలేదు.

Tags:    

Similar News