‌Huzurabad : కుల సంఘాలే కీలకమా? వారు ఏం అడిగితే అది

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కుల సంఘాలు కీలకంగా మారాయి. అన్ని పార్టీలూ కులాల వారీగా తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల [more]

Update: 2021-10-12 11:00 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కుల సంఘాలు కీలకంగా మారాయి. అన్ని పార్టీలూ కులాల వారీగా తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లున్నారు. వీరిలో దళిత ఓటర్లు 45 వేల మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే 21 వేల మందికి దళిత బంధు అమలయింది. మిగిలిన వారికి ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. దళిత బంధు పథకంతో పాటు ఇతర కులాల వారిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది.

కులాల వారీగా….

హుజూరాబాద్ లో కులాల వారీగా లెక్కలు తీసి కుల సంఘాలకు హామీలు ఇస్తున్నారు. వారి డిమాండ్లను కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. హుజూరాబాద్ లో రెడ్డి సామాజికవర్గం 22,600, మున్నూరు కాపు ఓటర్లు 29,100, పద్మశాలి 26,350, గౌడ సామాజికవగర్ం 24,200, ముదిరాజ్ 23,220, యాదవ సామాజికవర్గం 22,150, మాదిగ సామాజికవర్గం 35,600, మాల 11,100, షెడ్యూలు తెగలు 4,220 మంది, నాయీ బ్రాహ‌్మణ 3,300, మైనారిటీలు 5,100 మంది ఉన్నారు.

భవనాల నిర్మాణం కోసం…

ఇప్పటికే కుల సంఘాలతో పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేశాయి. కులసంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలంతో పాటు భవన నిర్మాణానికి సంబంధించిన నిధులను కూడా మంజూరు చేస్తున్నాయి. పద్మశాలీలకు హుజూరాబాద్ నగరంలో ఎకరం భూమితో పాటు కోటి రూపాయల నిధులను మంత్రి కుల సంఘ సమావేశంలో ప్రకటించడం విశేషం. ఇలా అనేక సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

కమ్యునిటీ హాళ్లు….

హుజూరాబాద్‍లో రంగనాయకుల గుట్ట వద్ద ముదిరాజ్‍ కుల దైవం పెద్దమ్మగుడి నిర్మాణానికి మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు. ఈ దేవాలయాన్ని రూ.30 లక్షలతో ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కుల సంఘాలతో పాటు అనేక గ్రామాల్లో కమ్యునిటీ హాళ్లను కూడా నిర్మించారు. ఇలా కుల సంఘలతో బీజేపీ, టీఆర్ఎస్ లు సమావేశమై అలివి కాని హమీలు ఇస్తూ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాయి.

Tags:    

Similar News