సెలక్షన్ లోనే పరేషాన్

కర్ణాటకలో ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలకూ అభ్యర్థుల ఎంపిక క్లిష్టతరంగా మారింది. ఈ నెల 30వ తేదీ వరకే నామినేషన్ల గడువు ఉండటంతో [more]

Update: 2019-09-26 18:29 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలకూ అభ్యర్థుల ఎంపిక క్లిష్టతరంగా మారింది. ఈ నెల 30వ తేదీ వరకే నామినేషన్ల గడువు ఉండటంతో ధీటైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలూ వెదుకులాట ప్రారంభించాయి. మొత్తం 15 స్థానాలకు కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించాయి. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుండటంతో పదిహేను నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ నెలకొననుంది. అయితే ఉప ఎన్నికలు వాయిదా పడటంతో అన్ని ప్రధాన పార్టీలూ ఊపిరి పీల్చుకున్నాయి. అభ్యర్థుల ఎంపికకు తమకు సమయం చిక్కిందని భావిస్తున్నాయి.

కొంతలో కొంత…..

కాంగ్రెస్ విషయానికొస్తే సిద్ధరామయ్య, పరమేశ్వర్, దినేష్ గుండూరావులు అభ్యర్థుల ఎంపికను చూస్తున్నారు. మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల వడపోత ఇప్పటికే జరిగిపోయింది. ఆర్థికంగా, ప్రజల్లో పట్టున్న నేతలను ఎంపిక చేసి బీజేపీ, జేడీఎస్ లకు దీటైన జవాబు చెప్పాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. సంకీర్ణ సర్కార్ ను కుప్పకూల్చారన్న సానుభూతి తమకు పనిచేస్తుందని భావిస్తున్నారు. మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కూడా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారారు. ఇప్పటికే పదిహేను నియోజకవర్గాలను ఒకసారి చుట్టి వచ్చిన కాంగ్రెస్ నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు.

ధీటైన అభ్యర్థులేరీ?

ఇక జనతాదళ్ విషయానికొస్తే తమకు చెందిన మూడు సిట్టింగ్ స్థానాల్లోనే బలంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. అయినా కర్ణాటకలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవెగౌడ స్పష్టం చేసిన నేపథ్యంలో పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే పొత్తులతో పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనమయిందని భావించిన దేవెగౌడ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలన్న యోచనలో ఉన్నారు. అందుకే ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు.

అన్నీ అనుమానాలే…..

అధికార బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికల జరుగుతుండటంతో సెలక్షన్ క్రిటికల్ గా మారింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల వారసులకు ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అంచనా వేస్తోంది. దాని వల్ల పార్టీలోనూ అసంతృప్తి తలెత్తనుంది. దీంతో చివరి నిమిషంలోనూ అభ్యర్థుల ఎంపికను చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఉప ఎన్నికలు కీలకం కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మొత్తం మీద కర్ణాటకలో మూడు ప్రధాన పార్టీలు పదిహేనులో అత్యథిక స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికను చేస్తున్నాయి.

Tags:    

Similar News