తిరుపతిలో పరపతి దక్కుతుందా?

తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే [more]

Update: 2021-04-09 05:00 GMT

తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార పార్టీ వైసీపీకి ధీటుగా ప్రచారం కోసం అన్ని స్థాయుల్లో నేతలు విపక్షాల నుంచి రంగంలోకి దిగారు. పార్టీల అధినేతలు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు అన్ని పార్టీల నేతలు తిరుపతి పార్లమెంటు పరిధిలో ప్రయత్నిస్తున్నాయి.

వైసీపీకి అదే అడ్వాంటేజీ….

తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా గత ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాదరావు గెలిచారు. ఆయనకు 7,22,877 ఓట్లు వచ్చాయి. ఈసారి పదిలక్షలకు పైగా ఓట్లు రావాలన్నది జగన్ బాధ్యులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ గెలుపు కూడా వైసీపీకి కలసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. పైగా స్థానికుడైన డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేయడం కూడా కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. తిరుపతిలో గెలుపు ఎప్పుడో ఖాయమయిందని, కేవలం మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీ టెన్షన్ అంతా మెజారిటీపైనే.

ఆ ఓట్లు వస్తే చాలా?

తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు దక్కలేదు. అందుకే తిరుపతిలో టీడీపీ ట్రాక్ రికార్డు బాగా లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పనబాక లక్ష్మినే మళ్లీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికలలో పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను తిరిగి రాబట్టుకుంటే చాలునన్న ప్రయత్నంలో టీడీపీ ఉన్నట్లు కన్పిస్తుంది. చంద్రబాబు తిరుపతి ఎన్నిక కోసం ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేశారు. వార్డు వాలంటీర్ల తరహాలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నియమించే పనిలో ఉన్నారు. మరి ఎంత చేసినా అధికార పార్టీ మెజారిటీని గతం కంటే తగ్గించాలన్నదే టీడీపీ లక్ష్యంగా కన్పిస్తుంది.

ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉన్నా…..

ఈసారి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి తిరుపతి బరిలో ఉన్నారు. గత ఎన్నికలలో పోటీ చేసిన బొమ్మిశ్రీహరికి కేవలం 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి జనసేన కలవడంతో ఆ పార్టీలో కొంత జోష్ కన్పిస్తుంది. అయితే జనసేన ఓట్లు బీజేపీకి పడతాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్న ప్రభను ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నుంచి చింతామోహన్ బరిలో ఉన్నారు. ఆయనకు గత ఎన్నికలలో 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ తాను తిరుపతిలో ద్వితీయస్థానంలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. అది సాధ్యం కాదనదేని విశ్లేషకుల వాదన.

Tags:    

Similar News