రాష్ట్రాలు అంటే ఎందుకు కోపం…?

కేంద్రంలోని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక లెక్కలు మొత్తం మార్చేశారు. అంతే కాదు, రాష్ట్రాల హక్కులను పూర్తిగా కత్తిరించడమే పనిగా పెట్టుకున్నారు అన్న విమర్శలు వచ్చాయి. జీఎస్టీ [more]

Update: 2021-05-23 03:30 GMT

కేంద్రంలోని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక లెక్కలు మొత్తం మార్చేశారు. అంతే కాదు, రాష్ట్రాల హక్కులను పూర్తిగా కత్తిరించడమే పనిగా పెట్టుకున్నారు అన్న విమర్శలు వచ్చాయి. జీఎస్టీ బిల్లు ఆమోదం ముందు వరకూ ఒకలా కధలు చెప్పి తీరా జీఎస్టీ దేశంలో అమలు అయ్యాక చట్టపరంగా రావాల్సిన రాష్ట్రాల ఆదాయాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ఇక రాష్ట్రాలలో వేరే పార్టీలు అధికారంలో ఉంటే వారిని ప్రత్యర్ధులు చూసినట్లుగానే చూస్తున్నారు అన్న విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి.

ఆయన కూడా…?

మోడీ నేరుగా ప్రధాని అయిన వారు కాదు, ఆయన కూడా ఒకప్పుడు ఆయన కూడా గుజరాత్ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినవారే. నిజానికి ముఖ్యమంత్రులుగా చేసిన వారు ప్రధానులుగా వస్తే ఫెడరల్ స్పూర్తి మరింతగా ఇనుమడిస్తుంది అని అంతా భావిస్తారు. వారికి అన్ని రకాల సమస్యలు తెలుసు. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది. ఇక పూర్వాశ్రమంలో వారు కూడా రాష్ట్రాలకు ఏలికగా ఉండడం వల్ల సాధకబాధకాలు అన్నీ క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉంటారు అని కూడా భావిస్తారు. మోడీ విషయంలో కూడా అందరూ అదే నిజమ‌వుతుంది అనుకున్నారు. కానీ మోడీ మాత్రం తాను డైరెక్ట్ గా ప్రధానిగానే వచ్చినట్లుగా భావిస్తూ రాష్ట్రాల విషయంలో కట్టడి చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు అన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి.

పార్టీ ఫిలాసఫీ చూసినా…?

ఇక బీజేపీ పేరులోనే భారతం ఉంది. ఆ పార్టీ జాతీయ పార్టీ. అంతే కాదు, బీజేపీ జాతీయ భావనను ఎక్కువగా వల్లిస్తూంటుంది. అలాంటిది దేశంలోని రాష్ట్రాల విషయంలో ఇలాంటి వివక్షను చూడడం బీజేపీ ఫిలాసఫీ కే విరుధ్ధం అన్న మాట కూడా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలూ కలిస్తేనే కేంద్రం అవుతుంది. అసలు కేంద్రం మిధ్య అని మూడున్నర దశాబ్దాల క్రితమే దివంగత నేత మాజీ సీఎం ఎన్టీయార్ అన్నారు. రాష్ట్రాల సమాఖ్యగానే కేంద్రాన్ని చూడాలి. రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులే కేంద్రానికి కూడా ఆదాయంగా ఉంటుంది. మరి దాన్ని తిరిగి రాష్ట్రాలకు వెచ్చించే విషయంలో అనవసర శషబిషలకు పోయి తికమక పెట్టడం కేంద్రానికి అవసరమా అన్న మాట కూడా ఉందిపుడు.

ప్రమాదకరమే…?

ఒకనాడు ఇందిరాగాంధీ టైమ్ లో కూడా రాష్ట్రాల పట్ల చులకన భావం పేరుకుపోవడం వల్లనే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడం, రాష్ట్రాలు తమ హక్కులు అంటూ పెద్ద గొంతు చేయడం జరిగింది. ఇపుడు చూస్తూంటే అలాంటి సీనే కనిపిస్తోంది అంటున్నారు. తెలంగాణా సర్కార్ ఈ విషయంలో గట్టిగానే కేంద్రాన్ని నిలదీస్తోంది. మంత్రులు కేటీయార్ ఈటెల వంటి వారు తమ రాష్ట్రలో ఉన్న వాక్సిన్ ని తామే వాడుకుంటామంటే ఏంచేస్తారు అని అడగడం మామూలుగా చూస్తే సబబు కాకపోయినా కేంద్రం వివక్ష తీరుతోనే ఆయన ఇలా మాట్లాడారు అనుకోవాలి. ఇప్పటికే తమిళులు తమది ఒక ప్రత్యేక దేశంగానే మనసులో భావించుకుంటారు.ఇలాంటి వేర్పాటు భావాలు పెచ్చరిల్లకుండా ఉండాలంటే కేంద్రం లో ఏలిన వారు జాగ్రత్తగా ఉండాలి. అయినా ప్రతిపక్ష రాష్ట్రాల మీద కక్ష కట్టడం రాజకీయం అనిపించుకోదు అన్న మాట కూడా ఉంది.

Tags:    

Similar News