తగ్గుతారా? తేల్చి పారేస్తారా?

అమరావతి రాజధానిని మూడుగా విభజించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదన నేడు కార్యరూపం దాల్చబోతుందా? మరికాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారా? [more]

Update: 2019-12-27 00:30 GMT

అమరావతి రాజధానిని మూడుగా విభజించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదన నేడు కార్యరూపం దాల్చబోతుందా? మరికాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారా? సర్వత్రా ఇదే చర్చ. ఉత్కంఠ. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో అందరూ ఉత్కంఠగా ఉన్నారు. కేబినెట్ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాలం సమావేశం చివరి రోజున మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ సభ ముందుంచిన సంగతి తెలిసిందే.

మూడు రాజధానులు…..

అమరావతి లెజిస్లేచర్ క్యాపిటల్ గా, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా చేయాలన్న ప్రతిపాదన ఉన్నట్లు జగన్ వెల్లడించారు. అయితే రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కూడా నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ కమిటీ కూడా అమరావతిలో రాజ్ భవన్, అసెంబ్లీ, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, విశాఖలో సెక్రటేరియట్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు వేసవి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జీఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొంది. అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది.

ఆందోళనలతో అట్టుడుకుతున్నా…

అసెంబ్లీలో జగన్ ప్రతిపాదించిందీ, జీఎన్ రావు కమిటీ చెప్పింది ఒకే రీతిలో ఉండటంతో దీనిని మంత్రివర్గం ఆమోదించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటుకు కావాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే మూడు రాజధానుల ప్రతిపాదనపై రాజధాని రైతులు మండి పడుతున్నారు. గత పదిరోజుల నుంచి వారు ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని రైతులకు అండగా టీడీపీ, జనసేన, సీపీఐలు నిలిచాయి. ఆందోళనలతో ప్రభుత్వం దిగిరాకుంటే న్యాయపరంగా తేల్చుకుంటామని కూడా రైతులు చెబుతున్నారు.

వారికి ప్యాకేజీ ఇచ్చి…..

ీదీంతో మరికాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడనుంది. సచివాలయం విశాఖకు తరలించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీంతో పాటు రాజధాని రైతులు నష్టపోకుండా వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. భూములు తిరిగి కావాలనే వారికి ఇచ్చేలా, అవసరం లేదనుకున్న వారికి ప్యాకేజీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మంత్రి వర్గ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. నిర్ణయం కోసం రాష్ట్ర మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.

Tags:    

Similar News