బుట్టావారి రాజకీయం యూట‌ర్న్.. సైలెంట్ అయిన బీసీ నేత‌

బుట్టా రేణుక‌. క‌ర్నూలు రాజ‌కీయాల్లో ఓ మెరుపు! నిజానికి ఆమె మెరుపు మాదిరిగానే ఇలా మెరిసి అలా మాయ‌మ‌య్యారు. అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలు ఎంపీగా 2014లో వైసీపీ [more]

Update: 2020-05-06 12:30 GMT

బుట్టా రేణుక‌. క‌ర్నూలు రాజ‌కీయాల్లో ఓ మెరుపు! నిజానికి ఆమె మెరుపు మాదిరిగానే ఇలా మెరిసి అలా మాయ‌మ‌య్యారు. అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలు ఎంపీగా 2014లో వైసీపీ త‌ర‌ఫున అనూహ్యంగా టికెట్ సంపాయించుకుని గెలుపు గుర్రం ఎక్కిన బుట్టా రేణుక‌ నిత్యం వార్తల్లో నిలిచేవారు. నిదానం, దూకుడు స్వభావం లేక‌పోవ‌డం బుట్టాకు క‌లిసి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఆమెకు వ్యూహం లోపించ‌డం మాత్రం శాపంగా మారింద‌న‌డంలో సందేహం లేదు. 2017 వ‌ర‌కు బాగానే ఉన్న రేణుక‌.. అనూహ్యంగా వైసీపీకి జ‌ల్ల కొట్టి వ‌చ్చి చంద్రబాబుకు జైకొట్టారు. వ్యూహాత్మకంగా పార్టీలో చేర‌కుండానే బాబుకు మ‌ద్దతిస్తున్నట్టు ప్రక‌టించారు.

బాబు వినకపోవడంతో….

అయితే 2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రెండు రోజుల‌కే బుట్టా రేణుక‌ భ‌ర్త టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె సైతం జ‌గ‌న్‌తో విబేధించి వైసీపీ నుంచి దూర‌మ‌య్యారు. వాస్తవానికి ఆమె ఆలోచ‌న ఏంటంటే.. త‌న‌కు అసెంబ్లీకి వెళ్లాల‌ని ఉంద‌ని, త‌న‌కు 2019లో అసెంబ్లీ సీటు ఎక్కడి నుంచి అయినా ఫ‌ర్వాలేద‌ని ఇవ్వాల‌ని జ‌గ‌న్ ను కోరిన‌ట్టు ప్రచారం జ‌రిగింది. అయితే దీనిపై జ‌గ‌న్ ఎలాంటి క్లారిటీ ఇవ్వక‌పోవ‌డం వ‌ల్లే.. బుట్టా రేణుక‌ బాబు కు జై కొట్టార‌ని అంటారు. త‌న‌సొంత నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మిగ‌నూరు సీటు ఇవ్వాల‌ని ఆమె కోరినా చంద్రబాబు ఆమెను అస్సలు ప‌ట్టించుకోలేదు.

రెంటికీ చెడ్డ రేవడిగా….

పోనీ.. అక్కడైనా బుట్టా రేణుక‌ త‌న కోరిక తీర్చుకున్నారా? అంటే అదీలేదు. చివ‌ర‌కు టికెట్ల పందేరం అంతా అయిపోయి. ఇక‌, త‌న‌కు టికెట్ రాద‌ని నిర్ణయించుకున్న త‌ర్వాత‌.. మ‌ళ్లీ వ‌చ్చి జ‌గ‌న్ ప‌క్షాన నిలిచారు. దీంతో ఇక్కడ కూడా ఎలాంటి అవ‌కాశం లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే బుట్టా రేణుక‌ వైసీపీలో ఉండి ఉంటే ఆమె వ‌రుస‌గా రెండోసారి క‌ర్నూలు ఎంపీగా గెలిచేవారు. ఆమె టీడీపీలోకి జంప్ అయ్యాక చివ‌ర‌కు క‌ర్నూలు ఎంపీ సీటు సైతం చంద్రబాబు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇచ్చి బుట్టా రేణుక‌ ను ఘోరంగా అవ‌మానించారు. మొత్తంగా చూస్తే.. వేసిన అడుగులు త‌డ‌బ‌డ‌డంతో రెంటికీ చెడ్డ రేవ‌డి అయ్యారు రేణుక‌.

నమ్మకం లేకనే…..

చివ‌ర‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక బుట్టా రేణుక‌ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చినా అప్పటికే చేయ‌డానికేం లేకుండా పోయింది. ఇక్కడ టిక్కెట్లు ఫుల్ అయిపోయాయి. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. ఒక్క‌సారి రాజ‌కీయాల్లో న‌మ్మకం కోల్పోతే.. ఏం జ‌రుగుతుందో అదే జరిగిందని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. వైసీపీలో ఉండ‌గా జ‌గ‌న్ ఆమెను న‌మ్మార‌ని, కానీ, ఆమె మ‌ధ్యలో టీడీపీకి జైకొట్టార‌ని, త‌ర్వాత వ‌చ్చినా.. ఆమెపై న‌మ్మకం క‌ల‌గ‌లేద‌ని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవ‌ల రాజ్యస‌భ టికెట్ల విష‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌న‌ను ప‌రిశీలించాల‌ని రేణుకబుట్టా రేణుక‌ అభ్యర్థించినా.. జ‌గ‌న్ ఆమెను ప‌ట్టించుకోలేదని అంటున్నారు. దీంతో మ‌రోసారి ఆమె ఆశ‌లు ఆవిర‌య్యాయి.

పదవి దక్కే అవకాశం లేక…?

ఇక‌, ఇప్పట్లో రాజ‌కీయంగా ఆమెకు ఎలాంటి అవ‌కాశం లేదు. పోనీ.. స్థానిక ఎన్నిక‌ల్లో అయినా వైసీపీ త‌ర‌ఫున ఏమైనా చేస్తున్నారా ? అంటే .. హైద‌రాబాద్‌లో త‌న విద్యాసంస్థల విష‌యాల‌కే బుట్టా రేణుక‌ ప‌రిమిత‌మ‌య్యార‌ని స‌మాచారం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డి లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చారు. ఇక రేసులో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి నుంచి చాలా మందే ఉన్నారు. బుట్టా రేణుక‌ కు ఏ ప‌ద‌వి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. మొత్తానికి బుట్టా రేణుక రాజ‌కీయం కూడా సందిగ్ధంగానే మారిపోయింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News