బుద్ధా వెంకన్నకే ఛాన్స్ అట… మరి ఏం జరుగుతుందో?

రాజ‌కీయ కీల‌క న‌గ‌రం.. విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎదుగుద‌ల ఎలా ఉన్నప్పటికీ.. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఒక‌వైపు.. పార్టీ ప‌రిస్థితి నానాటికీ.. [more]

Update: 2020-07-13 11:00 GMT

రాజ‌కీయ కీల‌క న‌గ‌రం.. విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎదుగుద‌ల ఎలా ఉన్నప్పటికీ.. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఒక‌వైపు.. పార్టీ ప‌రిస్థితి నానాటికీ.. దిగ‌జారుతున్నా.. నాయ‌కులు మాత్రం త‌మ ఆధిప‌త్య పోరులో విశ్రాంతి లేకుండా క‌ష్టప‌డుతున్నారు. న‌గ‌ర పార్టీలో ఉన్న న‌లుగురు కీల‌క నాయ‌కుల‌కు ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌దు. ఇక జిల్లా కీల‌క నాయ‌కుల‌కు న‌గ‌ర నాయ‌కుల‌కు పొసిగే ప‌రిస్థితి లేదు. మ‌రీ ముఖ్యంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ పీఠం కోసం.. నాయ‌కులు త‌ల‌ప‌డుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని దూకుడు పెంచుతున్నార‌నే విష‌యం బ‌హిరంగ ర‌హస్యంగా మారింది. ప‌శ్చిమ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీకి ప‌దును త‌క్కువ‌. ఇక్కడ ఆది నుంచి సీపీఐ ఆధిప‌త్యం ఉండేది.

గెలిచి మూడు దశబ్దాలు…..

అయితే, మ‌ధ్యలో సీపీఐ మ‌ద్దతుతో పోటీకి దిగిన జ‌లీల్ ఖాన్‌.. కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఇక‌, అప్పటి నుంచి కాంగ్రెస్ బ‌లం పెంచుకుంది. క‌మ్యూనిస్టుల ప్రాబ‌ల్యం ఉన్నప్పటికీ.. ఓటు బ్యాంకు మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. దీంతో టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. తూర్పు, సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటు బ్యాంకును పెంచుకోగ‌లిగినా.. ప‌శ్చిమ నియో‌జ‌క‌వ‌ర్గంలో మాత్రం టీడీపీ పుంజుకోలేక పోయింది. ఎప్పుడో పార్టీ పుట్టిన 1983 ఎన్నిక‌ల్లో జ‌య‌రాజ్ మిన‌హా ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌పున ఎప్పుడూ ఎవ్వరూ గెల‌వ‌లేదు. ఇక‌, ఇక్క‌డ నాగుల్ మీరా టీడీపీ త‌ర‌ఫున ఉన్నప్పటికీ.. ఆయ‌న దూకుడు ప్రద‌ర్శించే రాజ‌కీయ నేత‌ కాక‌పోవ‌డంతో.. పార్టీ ప‌రిస్థితి ఎక్కడి గొంగ‌ళి అక్కడే అన్న చందంగా మారిపోయింది.

ఇన్ ఛార్జి పదవి కోసం….

గ‌తంలో ఓ సారి నాగుల్ ‌మీరా.. టీడీపీ త‌ర‌ఫున ఇక్కడ పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన జ‌లీల్ ఖాన్‌.. అనూహ్యంగా టీడీపీలోకి వ‌చ్చారు. త‌ర్వాత గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో నాగుల్‌మీరాను ప‌క్కన పెట్టిమ‌రీ.. జ‌లీల్ ఖాన్ త‌న‌పంతం నెగ్గించుకున్నారు. త‌న కుమార్తె అయిన ష‌బానా ఖాతూన్‌కు అవ‌కాశం ఇప్పించుకున్నారు. ఆమె ఓడిపోవ‌డం, తిరిగి విదేశాల‌కు వెళ్లిపోవ‌డం జ‌రిగిపోయాయి. కానీ,ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ ఇంచార్జ్ పీఠం కోసం .. ఒక‌వైపు నాగుల్ మీరా.. మ‌రోవైపు.. ఎమ్మెల్సీ బుద్ధా వ‌ర్గం పోటీ ప‌డుతున్నాయి.

రెండు వర్గాలుగా…..

నాగుల్ మీరా.. ఎంపీ కేశినేని నాని వ‌ర్గం కావ‌డం.. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ఇటీవ‌ల కాలంలో పార్టీలో దూకుడుగా ఉండ‌డంతో ఈ రెండు వ‌ర్గాల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విషయంపై పంచాయి‌తీ న‌డుస్తోంది. ఒక‌ప్పుడు బుద్ధా వెంక‌న్న, కేశినేని నాని ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు.. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ వేలు పెట్టడంతో వీరిద్దరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ఇక ఎన్నిక‌ల్లో ఓడిపోయాక వీరిద్దరు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై మ‌రొక‌రు ట్వీట్ల వ‌ర్షం కురిపించుకున్నారు. ఇక ఇప్పుడు న‌గ‌ర్ మేయ‌ర్ ప‌ద‌విని త‌న కుమార్తె శ్వేత‌కు క‌ట్టబెట్టుకునే విష‌యంలో పావులు క‌దుపుతోన్న నాని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు కోసం పావులు క‌దుపుతున్నారు. ఈ క్రమంలోనే నాని వ‌ర్సెస్ వెంక‌న్న మ‌ధ్య తీవ్ర యుద్ధం న‌డుస్తోంది. మ‌రి ఈ ఆధిప‌త్య పోరులో ఈ ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి. ఇప్పటికైతే.. ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్నకు ఛాన్స్ ఇవ్వడ‌మే బెట‌ర్ అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేవిధంగా పార్టీలోకి కొంద‌రు త‌మ్ముళ్లు కూడా! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News