ఎన్నిక‌ల్లో పోటీకి టీడీపీ ఎమ్మెల్సీ రెడీ.. కాక రేగింది ?

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, విజ‌య‌వాడ టీడీపీ ఇంచార్జ్‌, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంక‌న్న.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. వాస్తవానికి [more]

Update: 2021-06-21 08:00 GMT

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, విజ‌య‌వాడ టీడీపీ ఇంచార్జ్‌, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంక‌న్న.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే.. అప్పట్లో ఎంపీ కేశినేని నాని అడ్డుప‌డ్డార‌నే వ్యాఖ్యలు వినిపించాయి. రాజ‌కీయంగా నిత్యం దూకుడుగా ఉండే బుద్దా వెంక‌న్న పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత ప్రియ‌మైన నేత‌ల్లో ఒక‌రుగా కొన‌సాగుతున్నారు.

చంద్రబాబుకు నమ్మకమైన….

పార్టీపైనా, పార్టీ అదినేత చంద్రబాబుపైనా ఎవ‌రు విమ‌ర్శ‌లు చేసినా.. వెంట‌నే రియాక్ట్ అయి కౌంట‌ర్లు ఇచ్చే బుద్దా వెంక‌న్నకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో ఆయ‌న‌ను పార్టీలోనూ జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా నియ‌మించారు. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క రోల్ పోషిస్తున్నారు. రాష్ట్ర స‌మ‌స్యల‌పైనా బుద్ధా వెంక‌న్న స్పందిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బుద్దా వెంక‌న్న పేరు రాజ‌కీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. టీడీపీ కి ఇక్కడ బ‌ల‌మైన నేత లేరు.

పశ్చిమ నియోజకవర్గంలో…?

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి వ‌చ్చిన జ‌లీల్ ఖాన్ కుమార్తెకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె వైసీపీ హ‌వా ముందు నిల‌వలేక ఓడిపోయారు. త‌ర్వాత ప‌రిణామాల్లో ఆమె విదేశాల‌కు వెళ్లిపోయారు. అదే స‌మ‌యంలో జ‌లీల్ ఖాన్ .. అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో ఇక్కడ నుంచి పోటీచేసే నేత‌లు టీడీపీకి లేకుండా పోయారు. అయితే.. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత ఇక్కడ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్ర‌స్తుతం ఆమె కార్పొరేట‌ర్‌గా ఉన్నారు. అయితే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ స‌మీక‌ర‌ణ‌లు సెట్ అయ్యేలా లేవు.

తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ?

ఈ నేప‌థ్యంలో ఇక్కడి టికెట్‌ను త‌న‌కు ఇవ్వాల‌ని.. బీసీ నేత‌గా తాను గెలిచి తీరుతాన‌ని చంద్రబాబు వ‌ద్ద బుద్దా వెంక‌న్న ప్రతిపాద‌న పెట్టిన‌ట్టు స‌మాచారం. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోన‌ప్పటికీ.. బుద్దా వెంక‌న్న మాత్రం ఆశ‌లు పెంచుకున్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు కూడా కేశినేని నానితో గొడ‌వ నేప‌థ్యంలో తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌స‌రం అయితే ఎంపీగానే పోటీ చేస్తాన‌ని ఓపెన్‌గానే చెప్పారు. క‌రోనా త‌గ్గిన త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేసి.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. త‌న ప్రస్థానాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు బుద్ధా వెంక‌న్న ప్రయ‌త్నిస్తున్నారు. మ‌రి చంద్రబాబు చివ‌ర‌కు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News