సత్తిబాబు పని వత్తి వెలిగించడమేనా?

పేరుకు పాతికమంది మంత్రులు ఉన్నా కూడా సీనియర్ల కొరత వైసీపీ సర్కార్ ని వేధిస్తోంది. ఓడిపోయినా కూడా తమ్ముళ్ల మాటల తూటాల ముందు వైసీపీ సర్కార్ వెలవెలబోతోంది. [more]

Update: 2019-09-18 09:30 GMT

పేరుకు పాతికమంది మంత్రులు ఉన్నా కూడా సీనియర్ల కొరత వైసీపీ సర్కార్ ని వేధిస్తోంది. ఓడిపోయినా కూడా తమ్ముళ్ల మాటల తూటాల ముందు వైసీపీ సర్కార్ వెలవెలబోతోంది. మీడియానే నమ్ముకుని తెల్లారిలేస్తే తమ్ముళ్ళు సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి జవాబు చెప్పేవారు పెద్దగా లేరు. అయితే ఒకే ఒక్కడుగా మాత్రం బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేయడమే కాదు, పీసీసీ చీఫ్ గా కూడా పనిచేసిన అనుభవం ఇపుడు అక్కరకు వస్తోంది. జగన్ ప్రభుత్వం నుండి పెద్ద నోరుగా చెప్పుకోవాలంటే బొత్స సత్యనారాయణ పేరునే ముందుగా వాడాలి. బొత్స సత్యనారాయణ చంద్రబాబు మొదలుకుని పవన్ బాబు వరకూ అందరికీ ఒకేసారి సమాధానాలు చెప్పగల దిట్ట.

జగన్ కి ఇబ్బందేనట…..

ఇక బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అనడాన్ని బట్టి చూస్తే బొత్స సత్యనారాయణ బాణాలు తమ్ముళ్ళకు సూటిగానే తగులుతున్నాయని భావించాలేమో. ఆయన చెబుతున్న మాటలకు అర్ధాలు మీడియా ప్రతినిధులు వెతుక్కోవాలని కూడా ఆనంద్ బాబు అంటున్నారు. బొత్స సత్యనారాయణ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండకపోతే డేంజర్లో పడతారని కూడా తమ్ముళ్లు అంటున్నారు. బొత్స సత్యనారాయణ జగన్ కుటుంబాన్ని నానా మాటలు అన్న సంగతిని ఇన్నేళ్ల తరువాత గుర్తు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఆయన చిత్తశుద్ధి సందేహమేనని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ కి బొత్సకు మధ్య విభేధాలు సృష్టించాలని నక్కా ఆనందబాబు లాంటి వారు ఇలాంటి మాటలు అంటున్నారని అనుకున్నా సొంత పార్టీలోనూ బొత్స సత్యనారాయణ దూకుడుపైన అసంతృప్తి ఉందని అంటున్నారు.

ఇరకాటం పెట్టేస్తున్నారా…?

బొత్స సత్యనారాయణ మీడియా పులి అని ఒకసారి మైకులు కనబడితే ఆయన ఏం మాట్లాడుతారో కూడా తెలియకుండా మాట్లాడేస్తారని కూడా వైసీపీ నేతల్లో భావన ఉందంటున్నారు. రాజధాని అమరావతి విషయమే తీసుకుంటే చిరిగి చేటను చేసారని, దీని వల్ల ప్రభుత్వంపై జనాలకు కొత్త డౌట్లు వచ్చాయని కూడా అంటున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే బొత్స సత్యనారాయణ తాను ఒకటికి పది మెట్లు దిగి వైసీపీలో చేరానని తాజాగా కూడా మీడియాతో చెప్పారు. అంటే బొత్స సత్యనారాయణ తన స్థాయి జగన్ తో సమానమనా, లేక అంతకంటే ఎక్కువ అని ఊహించుకుని మాట్లాడారా అన్న కామెంట్స్ కూడా వైసీపీ శిబిరంలో వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా ఇప్పటికైతే బొత్స సత్యనారాయణ జగన్ సర్కార్లో నోరు చేసుకుని మాట్లాడే మంత్రిగా ఉన్నారు. ఆయన ఓ విధంగా ప్లస్ మరో విధంగా మైనస్ అని కూడా అన్న వారూ ఉన్నారు. మరి జగన్ మిగిలిన మంత్రులను కూడా కదిలించి చురుకుదనం తెప్పిస్తేనే తప్ప బొత్స దూకుడు ఆగదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News