ఆ ఇద్దరి మధ్యన భలే దోస్తీ… ?

విజయనగరం జిల్లా రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారు ఎవరైనా అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణదే రాజ్యమని అనుకోవడం సహజం. ఆయన కూడా మూడు దశాబ్దాల [more]

Update: 2021-09-20 06:30 GMT

విజయనగరం జిల్లా రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారు ఎవరైనా అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణదే రాజ్యమని అనుకోవడం సహజం. ఆయన కూడా మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో దూకుడుగానే ఉన్నారు. ప్రభుత్వం, పార్టీ ఏదైనా తన మాటనే నెగ్గించుకుంటారని పేరు. ఈ రోజుకూ జిల్లా నిండా బొత్స సత్యనారాయణ అనుచర వర్గమే కనిపిస్తుంది. అటువంటి బొత్సను సవాల్ చేసే రాజకీయం కూడా ఇదే జిల్లాలో ఉంది. వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి బొత్స సత్యనారాయణ కు పడదన్నది కూడా తెలిసిన విషయమే. ఇది మూడు దశాబ్దాల కాలం నాటి వైరం కూడా.

ఫ్లాష్ బ్యాక్ వార్….

ఈ ఇద్దరి మధ్యన గొడవలకు కారణం టికెట్ రాజకీయమే. 1989లో మొదటిసారిగా కోలగ‌ట్ల విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నాడు కాంగ్రెస్ టికెట్ మీద ఆయన పోటీ చేశారు. అయితే ఆయనకు బొత్స సత్యనారాయణ వర్గం నుంచి సహకారం లభించలేదు. పైగా టీడీపీకి మేలు చేసేలా వ్యవహరించారు అని కోలగట్ల వర్గం ఆరోపిస్తుంది. అప్పట్లో కాంగ్రెస్ గాలి బలంగా వీచినా కూడా కేవలం పదివేల ఓట్ల తేడాతో కోలగట్ల ఓడారు. ఇక 2004లో వైఎస్సార్ స్వయంగా టికెట్ ఇస్తామని చెప్పి కూడా కోలగట్లకు ఇవ్వలేకపోయారు. దాని వెనక బొత్స సత్యనారాయణ వత్తిడి ఉందని అంటారు. ఆయన మరో కాంగ్రెస్ నేత‌ గురాన సాధూరావు కి టికెట్ ఇప్పించారు. దాంతో ఇండిపెండెంట్ గా కోలగట్ల పోటీ చేసి సత్తా చూపారు. ఏకంగా అశోక్ ని తొలిసారి ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

తప్పని పోరు ….

ఇక కాంగ్రెస్ లో బొత్స సత్యనారాయణ హవా ముందు తాము సరితూగలేమని భావించిన కోలగట్ల ఆయన వర్గం వైఎస్సార్ చనిపోయాక జగన్ పార్టీలో చేరారు. ఆ విధంగా జిల్లాలో చక్రం తిప్పారు కూడా. అయితే సడెన్ గా బొత్స కూడా అదే పార్టీలో ఎంట్రీ ఇచ్చి తన పలుకుబడిని జగన్ వద్ద పెంచుకున్నారు. ఇపుడు జిల్లా వైసీపీ అంతా బొత్స మయంగానే ఉంది. తొలిసారి పార్టీలో చేరి జిల్లాలో వైసీపీని పటిష్టం చేసిన కోలగట్ల కనీసం మంత్రిగా కూడా కాలేకపోయారు.ఈ పరిణామాలు ఇలా ఉండగా తన కుమార్తెను మేయర్ ని చేద్దామనుకున్నా బీసీ రిజర్వేషన్ల పేరిట బొత్స సత్యనారాయణ అడ్డు చక్రం వేశారు. దీంతో డీలా పడిన కోలగట్ల కిం కర్తవ్యం అని ఆలోచనలు చేస్తూ వచ్చారు.

రాజీయే శరణ్యమా..?

ఈ నేపధ్యంలో జిల్లా సమీకరణలు కూడా మారుతున్నాయి. బొత్స సత్యనారాయణను మరోమారు మంత్రిగా జగన్ కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది. అదే విధంగా కోలగట్లకు మంత్రి కుర్చీ దక్కదు అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. దాంతో తన కుమార్తె శ్రావణి ఫ్యూచర్ కోసం కోలగట్ల రాజీమంత్రం పఠిస్తున్నారు అంటున్నారు. ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా బొత్స సత్యనారాయణతో సఖ్యతను కోరుకుంటున్నారు అని చెబుతున్నారు. ఈ మధ్యనే తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బొత్స ద్వారా ప్రారంభోత్సవాన్ని చేయించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా బొత్సతో కలసి కలివిడిగా మెలిగారు. మరో రెండున్నరేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ దక్కాలి. ఆమె గెలవాలి. దాని కోసం బొత్స సత్యనారాయణతో ఎలాంటి అడ్డంకులు ఉండకుండా కోలగట్ల తెలివిగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు. మరి ఈ దోస్తీ ఎంతకాలం కోనసాగుతుంది. బొత్స కోలగట్లకు హ్యాండ్ ఇస్తారా లేక చేతులు కలిపి ముందుకు సాగుతారా అనంది రాజకీయ తెర మీద వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News