జగన్ కే బొత్స షాకిచ్చారా?

అవును మరి, వర్తమాన రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. లేకపోతే వైఎస్సార్ క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నడవకుండా ఓడి ప్రతిపక్షంలో ఉన్న [more]

Update: 2020-01-08 06:30 GMT

అవును మరి, వర్తమాన రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. లేకపోతే వైఎస్సార్ క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా నడవకుండా ఓడి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాటలు వినడమేంటి. ఇది వింతా, విడ్డూరమే మరి. అయితే ఏ మీడియా కూడా ఇన్నాళ్ళైనా ఈ లోగుట్టుని బయటపెట్టలేకపోయింది. తనంత తానుగా ఇన్నేళ్ళకు బొత్స స్వయంగా ఈ విషయం చెప్పేవరకూ ఎవరికీ కూడా తెలియకపోయింది. ఇంతకీ ఇది ఎలా జరిగిందంటే పదహారేళ్ళ క్రితం నాటి ఉమ్మడి ఏపీ రాజకీయానికి వెళ్ళాల్సిందే. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినపుడు బొత్స సత్యనారాయణ తొలిసారి మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయన భారీ పరిశ్రమల శాఖామంత్రిగా కూడా కీలకమైన శాఖలు చూశారు.

బాబు చెప్పారట…

అప్పట్లో ఓక్స్ వ్యాగన్ కార్ల తయారీ కంపెనీ విశాఖ వస్తుందని వైఎస్సార్ సర్కార్ ఒకటే ఊదరగొట్టింది. అయితే తరువాత చూస్తే ఒక దళారీతో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని పరువు పోగొట్టుకుంది. అసలు ఓక్స్ వేగన్ కంపెనీకి ఈ గొడవతో సంబంధం లేదని కూడా తేలింది. ఏటి సేత్తాం… సొమ్ములు పోనాయి అంటూ బొత్స నాడు ఉత్తరాంధ్ర యాసలో బాధ పడిన కధ కూడా లోకం చూసింది. దాని మీద విచారణ కూడా జరిగింది. మొత్తానికి దళారీగా ఉన్న చోస్టన్ అన్న వ్యక్తి కటకటలా పాలు అయ్యారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వెనక్కి వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ చోస్టన్ అన్న వ్యక్తికి ఇంగ్లీష్ కూడా పెద్దగా రాని బొత్స సత్యనారాయణకు మధ్య బంధం ఎలా కుదిరిందన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఇన్నాళ్ళకు ఆ గుట్టుని బొత్స విప్పి అసలు విషయం చెప్పారు. తనకు చోస్టన్ ని పరిచయం చేసిందీ ఎవరో కాదు, చంద్రబాబు అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

ఏంటి సంబంధం…?

నిజానికి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న బొత్సకు చోస్టన్ ని చంద్రబాబు ఎలా పరిచయం చేశారు. అది బొత్స ఎలా నమ్మారు. అప్పటికే ఉప్పు, నిప్పులా వైఎస్సార్ తో సంబంధాలు ఉన్న బాబు చెబితే బొత్స సత్యనారాయణ ఎలా తేలిగ్గా నమ్మేశారు. ఇవన్నీ ప్రశ్నలే. కానీ వీటిని తాజాగా తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంతో బొత్స మాట్లాడుతూ తాను కూడా ఒకప్పుడు బాబుకు సన్నిహితుడినేనని బాంబు పేల్చారు. అంటే కాంగ్రెస్ లో ఉన్నా కూడా బాబుతో బొత్స దోస్తీ చేశారన్న మాట. వైఎస్ ని ఓ వైపు బాబు తిడుతున్నా కూడా స్నేహం చేయడమే కాదు, బాబు చెప్పినట్లుగా చోస్టర్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న మాట.

జాగ్రత్త సుమా…

తన లాంటి సన్నిహితుడినే మోసం చేసిన బాబు రైతులకు ఏం న్యాయం చేస్తారన్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఈ పాత కధను చెప్పినా కూడా ఇపుడు అధికారంలో ఉన్నది వైఎస్ కుమారుడు జగన్, మరి తన తండ్రిని కూడా పక్కన పెట్టి రాజకీయ శత్రువు బాబు మాటను విన్నానని తానే స్వయంగా బొత్స చెబుతున్న వేళ ఆయన విషయంలో జగన్ కూడా జాగ్రత్తగా ఉండాలని వైసీపీలోనే అంటున్నారు. బొత్స సత్యనారాయణ ఇక్కడ బాబుని చెడ్డ చేయబోయి తానే ఇరుక్కున్నారన్న ప్రచారమూ సాగుతోంది.

ఎవరికి షాక్..?

ప్రత్యర్ధి పార్టీలతో చెలిమి చేయడమే కాదు, ప్రభుత్వ విధానాల్లోనూ వారి పాత్రను తీసుకురావడం తప్పు. మరి దాన్ని బొత్స సత్యనారాయణ చేసి నాటి వైఎస్సార్ కి మోసం చేయడమే కాదు, ఓక్స్ వ్యాగన్ రూపేణా ఏపీకీ అపకీర్తి తెచ్చారని అంటున్నారు. వైఎస్సార్ నే ఆదమరచిన బొత్స సత్యనారాయణ జగన్ విషయంలో ఏమైనా చేయగలరు అన్న మాట కూడా అంటున్నారు. పైగా బొత్స అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్ గా జగన్ కుటుంబాన్ని అంతంత మాటలు అని కూడా ఇపుడు అధికారం కోసం పక్కన చేరారు. ఈ పాత కధను తిరగేసిన బొత్స సత్యనారాయణ బాబుకు షాక్ ఇవ్వలేదు, జగన్ కే ఇచ్చారని కూడా అంటున్నారు.

Tags:    

Similar News