వైసీపీలో సింగిల్ మెన్ ఆర్మీ.. టీడీపీలో వ‌న్ మ్యాన్ షో

ఎక్కడైనా ఏ రాజ‌కీయ పార్టీలో అయినా.. స‌మ‌ష్టి కృషి అత్యంత కీల‌కం. ఎక్కడా ఎవ‌రూ.. ఒంట‌రిగా ఎదిగిన సంద‌ర్భాలు ఉండ‌వు. అదే స‌మ‌యంలో నాయ‌కులు కూడా ఒంట‌రిగా [more]

Update: 2021-05-13 11:00 GMT

ఎక్కడైనా ఏ రాజ‌కీయ పార్టీలో అయినా.. స‌మ‌ష్టి కృషి అత్యంత కీల‌కం. ఎక్కడా ఎవ‌రూ.. ఒంట‌రిగా ఎదిగిన సంద‌ర్భాలు ఉండ‌వు. అదే స‌మ‌యంలో నాయ‌కులు కూడా ఒంట‌రిగా స‌త్తా చూపించిన ప‌రిస్థితి క‌నిపించదు. కానీ, ఏపీలో మాత్రం ఇలాంటి ప‌రిణామాలు ఖ‌చ్చితంగా క‌నిపిస్తాయి. స‌మ‌ష్టి కృషితో ప‌నిలేదు. అంద‌రినీ క‌లుపుకొని వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. త‌మ వారు, త‌మ రాజ‌కీయాలు ఉంటే చాలు! అనే ధోర‌ణితో రాజ‌కీయాలు న‌డుస్తున్న జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఉత్తరాంధ్రకు ప్ర‌త్యేక‌త ఉంది.

ఇక్కడ మాత్రం…?

ఇక్కడి విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో నేతలు, పార్టీ హ‌వా క‌న్నా.. వ్యక్తి, నేత హ‌వా ఎక్కువ‌గా వర్కవుట్ అవుతోంది. పార్టీ ఏదైనా.. ఎవ‌రు ఆ పార్టీలో కీల‌కంగా ఉన్నారో.. వారే జిల్లాను శాసిస్తున్న ప‌రిస్థితి ఉంటోంది. ఇలాంటి జిల్లాల్లో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది.. విజ‌య‌న‌గ‌రం జిల్లా. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండ‌డంతో ఇక్కడ సింగిల్ ఆర్మీ షో న‌డుస్తోంది. టీడీపీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో ఇక్కడ వ‌న్ మ్యాన్ షో.. న‌డుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో టీడీపీకి, కాంగ్రెస్‌కు ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉన్న రాజ‌కీయాలు.. త‌ర్వాత త‌ర్వాత వ్యక్తి పూజ‌గా, వ్యక్తి హ‌వాగా మారిపోయాయి.

టీడీపీ ఉన్నప్పుడు…..

కొన్ని రోజులు.. టీడీపీ నాయ‌కుడు.. అశోక్ గ‌జ‌ప‌తి రాజు చుట్టూ తిరిగాయి. ఇప్పుడు మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చుట్టూ తిరుగుతున్నాయి. పోనీ.. వ్యక్తి పూజ‌లు, రాజ‌కీయాల‌తో వారి వారి పార్టీల‌కు మేలు జ‌రుగుతుందా ? అంటే.. అది కూడా లేదు. దీనికి ప్రధాన కార‌ణం.. టీడీపీ అయినా.. గ‌తంలో కాంగ్రెస్ అయినా.. ఇక్కడ పూర్తిగా ప‌ట్టు సాధించింది.. ఫిఫ్టీ-ఫిఫ్టీనే..! దీంతో నేత‌ల హ‌వా ఉన్నప్పటికీ.. కేవ‌లం అది వారి వ్యక్తిగ‌త ల‌బ్ధికి మాత్రమే ప్రయోజ‌నంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం విజ‌య‌న‌గ‌రంలో వైసీపీ పూర్తిగా ప‌ట్టు సాధించింది. క్లీన్ స్వీప్ చేసింది.

బొత్స కేంద్రంగానే..?

దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ హ‌వా జిల్లాలో మామూలుగా లేదు. జిల్లాలో ఎంపీ బెల్లాన చంద్రశేఖ‌ర్‌తో పాటు కురుపాం నుంచి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణితో పాటు సాలూరు నుంచి పీడిక‌ల రాజ‌న్న దొర లాంటి కీల‌క నేత‌లు ఉన్నా కూడా బొత్స సత్యనారాయణ క‌నుస‌న్నల్లోనే రాజ‌కీయం న‌డుస్తోంది. ఇక టీడీపీలో ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కేంద్రంగానే ఇప్పటికీ రాజ‌కీయం న‌డుస్తోంది. మ‌రి ఈ ప‌రిస్థితిలో ఎప్పటికి మార్పు వ‌స్తుందో ? చూడాలి..

Tags:    

Similar News