అక్కడ ఎన్నికకు సిద్ధమయ్యారా?

కశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో రాష్రానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నేతలతో అఖిలపక్ష సమావేశం [more]

Update: 2021-07-05 16:30 GMT

కశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో రాష్రానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నేతలతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ- పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ), గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్)తో పాటు పీసీసీ చీఫ్ జి.ఎ. మిర్, జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోనె, భాజపా సీనియర్ నాయకుడు రవీందర్ రైనా, సీపీఎం నాయకుడు మహమ్మద్ తారిగామి, పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీంసింగ్, రాష్టానికి చెందిన కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్, గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. విభిన్న వైఖరులు గల నాయకుల సమావేశం సానుకూల వాతావరణంలో జరగడం శుభ పరిణామం.

ఎన్నికలకు ఎప్పుడనేది?

370 వ అధికరణ రద్దుపై భిన్న వైఖరులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం కావడం సానుకూల పరిణామంగా పేర్కొనవచ్చు. 2019 ఆగస్టు 5న 370 అధికరణ రద్దు, రాష్ర్ట విభజన, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటన అనంతరం జరిగిన కీలక సమావేశం ఇది. ప్రజాస్వామ్య పునరుద్ధరణపై ఏకాభిప్రాయం వ్యక్తమైనంత మాత్రాన అంతా సాఫీగా ఉందని చెప్పలేం. రాష్ర్ట హోదాను పునరుద్ధరించిన తరవాత ఎన్నికలకు వెళ్లాలని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు కోరుతుండగా, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఎన్నికలకు వెళ్లాలన్నది కేంద్రం ఆలోచన. ఇందులో ఎవరి స్వార్థం వారికి ఉంది.

పట్టున్న ప్రాంతాల్లో….

రాష్ర్ట విభజనకు ముందు అసెంబ్లీలో 87 సీట్లున్నాయి. మరో 24 సీట్లను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు కేటాయించారు. 2019 ఆగస్టులో రాష్ర్ట విభజన అనంతరం లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి దానికి నాలుగు సీట్లను కేటాయించారు. ఇవి పోనూ కశ్మీర్ లోయలో 46, జమ్ములో 37 కలిపి మొత్తం 83 సీట్లున్నాయి. 2014 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి. రాష్ట్రం స్థూలంగా కశ్మీర్, జమ్ముగా విడిపోయింది. కశ్మీర్ లో ముస్లిములు, జమ్ములో హిందువుల ప్రాబల్యం ఎక్కువ. ఎన్నికల ఫలితాలు కూడా ఈ విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కమలం పార్టీ సాధించిన 25 సీట్లలో ఎక్కువభాగం జమ్ము, పీడీపీ సాధించిన 28 సీట్లలో సింహభాగం కశ్మీర్ ప్రాంతంలోనివి కావడం గమనార్హం. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ రెండు చోట్లా కొన్ని సీట్లు గెలుచుకుని ఉనికి చాటుకున్నాయి.

అదే వారి ఆందోళన….

నియోజకవర్గాల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తాత్కాలిక అంచనాల మేరకు కశ్మీర్ లో నాలుగు, జమ్ములో మూడు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మొదట పునర్విభజనను ముస్లిం పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకించాయి. దీనివల్ల జమ్ములో సీట్లు పెరిగి బీజేపీ అక్కడ మరింత బలపడుతుందన్నది వాటి ఆందోళన. 2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్ జనాభా 68.88, 475, కాగా జమ్ము జనాభా 53,75,536 వేలు. ఈ మేరకు నియోజకవర్గాల్లోనూ తేడా వస్తాయన్నది వాటి అనుమానం. తాజా అంచనాల ప్రకారం రెండు చోట్లా పెరగనున్న సీట్ల వివరాలను చూసిన తరవాత వాటి వైఖరిలో మార్పు వచ్చింది. తమకు పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదన్న అంచనాకు వచ్చాయి.

ఎన్నికలకు వెళ్లాలన్నదే…

బీజేపీ లెక్కలు వేరేగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రాభవం కనుమరుగవున్న తరుణంలో జమ్ములో మెజార్టీ సీట్లు తన ఖాతాలో పడతాయని అంచనా వేస్తోంది. అదే సమయంలో కశ్మీర్ లో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ఓట్లు చీలిపోతాయని తాము ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తామని, అప్పుడు ఇతర చిన్న పార్టీల మద్దతుతో శ్రీనగర్ అధికార పీఠాన్ని అందుకుంటామని లెక్కలు కడుతోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉండటం, గవర్నర్ ఎటూ తన మనిషే కావడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమించవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ లో ఎన్నికలకు వెళ్లడమే మేలన్నది కమలనాథుల అంచనా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News