పరువు నిలుపుకున్నట్లేనా?

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కొంత ఊపిరి పీల్చుకుంది. కరోనా క్లిష్టసమయంలోనూ యడ్యూరప్పకు ఈ విజయాలు కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి. కర్ణాటకలో ఒక పార్లమెంటు, [more]

Update: 2021-05-21 17:30 GMT

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కొంత ఊపిరి పీల్చుకుంది. కరోనా క్లిష్టసమయంలోనూ యడ్యూరప్పకు ఈ విజయాలు కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి. కర్ణాటకలో ఒక పార్లమెంటు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవి పై తలెత్తిన అసంతృప్తిని కొంత వరకూ తొలగించగలిగారనే చెప్పాలి.

లోక్ సభ ఎన్నికలో స్వల్పంగా…..

బెళగావి లోక్ సభ స్థానంలో బీజపీ అభ్యర్థి మంగళ అంగడి విజయం సాధించారు. ఈ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ ఎన్నికలోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా? నేనా అన్నట్లు పోటీ సాగింది. చివరకు బీజేపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం యడ్యూరప్పకు రిలీఫ్ అనే చెప్పాలి. అయితే తక్కువ ఓట్లతో బీజేపీ గెలుపొందడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.

భారీ మెజారిటీ…

ఇక బసవకల్యాణ, మస్కి అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరిగాయి. బసవ కల్యాణలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర విజయం సాధించారు. ఇక్కడ అత్యధిక మెజారిటీని సాధించారు. దాదాపు ఇరవై వేల ఓట్ల తేడాతోకాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. దీంతో బసవకల్యాణను చేజిక్కించుకోవడం బీజేపీలో ఉత్సాహాన్ని నింపింది. ఇక మస్కి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి బసవన గౌడ తుర్కిహాళ్ దాదాపు 36 వేల మెజారిటీతో గెలుపొందారు.

ఎవరి ఆనందం వారిదే?

మూడు స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకున్నామని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని యడ్యూరప్ప వర్గం వాదిస్తుంది. కానీ రెండు స్థానాల్లోనూ స్వల్ప మెజారిటీతో గెలవడం, మస్కిలో అత్యథిక మెజారిటీని సాధించడంతో యడ్యూరప్ప ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి రెండు పార్టీలకూ ఈ ఉప ఎన్నికలు ఊరటనిచ్చాయనే చెప్పాలి. ఎవరి లెక్కలు వారు వేసుకుని క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News