బైరెడ్డి ఆగ్రహం ఆ మంత్రి పైనేనా…?

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన్నాళ్లుగా సాగుతున్న వైసీపీ వ‌ర్గ పోరు మ‌రోసారి రోడ్డున ప‌డింది. ఎమ్మెల్యే ఆర్థర్ యువ నాయ‌కుడు, నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వయ‌క‌ర్త బైరెడ్డి సిద్ధార్థ [more]

Update: 2020-11-22 02:00 GMT

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన్నాళ్లుగా సాగుతున్న వైసీపీ వ‌ర్గ పోరు మ‌రోసారి రోడ్డున ప‌డింది. ఎమ్మెల్యే ఆర్థర్ యువ నాయ‌కుడు, నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వయ‌క‌ర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి .. ఆది నుంచి విమ‌ర్శలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆధిప‌త్య పోరులో ఇద్దరి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. అయితే.. జిల్లాలోని ఓ కీల‌క మంత్రి ఈ పోరులో వేలుపెట్టడం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా పావులు క‌ద‌ప‌డం మ‌రింతగా రాజ‌కీయాల‌ను వేడెక్కించింది. దీంతో బైరెడ్డి మ‌రింత రెచ్చిపోయారు. యువ‌త‌కు ప్రాధాన్యం ద‌క్కడం లేద‌ని బ‌హిరంగ విమ‌ర్శలు చేశారు.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా…..

అంతేకాదు.. స‌ద‌రు మంత్రిపై ఒంటికాలిపై లేచారు. మేం పార్టీలో ఉండాలో వ‌ద్దో తేల్చుకోవాలంటూ.. స‌వాల్ రువ్వారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరు ఒక్కసారిగా రాష్ట్ర స్థాయికి చేరింది. విష‌యంలోకి వెళ్తే.. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కావ‌డంతో ఈ సీటును జ‌గ‌న్ మాజీ అసెంబ్లీ మార్షల్ అధికారి అయిన ఆర్థర్‌కు కేటాయించారు. అదే స‌మ‌యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వ్యూహాత్మకంగా ఇక్కడి బాధ్యత‌ల‌ను అప్పగించారు. అయితే, బైరెడ్డి దూకుడు ప్రద‌ర్శిస్తున్నార‌ని, ఎమ్మెల్యే అయిన‌ప్పటికీ.. తాను ర‌బ్బర్ స్టాంపుగా మారిపోయాన‌ని ఆర్థర్ ఎప్పటి నుంచో ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీలోనూ చ‌ర్చనీయాంశంగా మారింది.

మంత్రి గారి సపోర్ట్ తో…..

చివ‌ర‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజ‌క‌వ‌ర్గంలో బైరెడ్డి వ‌ర్గానికి 70 శాతం సీట్లు ఇస్తే, ఆర్థర్ త‌న వ‌ర్గానికి కేవ‌లం 30 శాతం సీట్లు మాత్రమే ఇప్పించుకోగ‌లిగారు. గ‌తంలో ఆర్థర్ బ‌హిరంగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని, ఆయ‌న‌కు సపోర్ట్ చేస్తోన్న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శలు చేశారు. అయితే ఇప్పుడు జిల్లాలో బైరెడ్డి దూకుడుకు చెక్ పెట్టాల‌ని భావిస్తోన్న ఓ మంత్రితో పాటు కొంద‌రు నేతు ఎమ్మెల్యే ఆర్థర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రితో మిలాఖ‌త్ అయిన ఎమ్మెల్యే ఆర్థర్‌.. త‌న హ‌వాను ప్రద‌ర్శించ‌డం ప్రారంభించారు. అడుగ‌డుగునా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అడ్డు ప‌డుతున్నార‌నే వాద‌న ఉంది.

వివాదం కొత్త మలుపు….

ఇటీవ‌ల ‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర పూర్తయి మూడేళ్లు గడిచిన సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో ర్యాలీ, పటేల్‌ సెంటర్‌లో సభ నిర్వహించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అయితే, తొలుత ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డు చెప్పారు. అతి క‌ష్టం మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, త‌న‌కు అడ్డు త‌గులుతున్న ఆర్థర్ వెనుక మంత్రి ఉన్నార‌ని.. పేర్కొంటూ.. పేరు చెప్పకుండానే ఫైర‌య్యారు. పార్టీలో యువ‌త‌కు ప్రాధాన్యం లేదా.. పార్టీలో ఉండ‌మంటారా ? పొమ్మంటారా ? తేల్చేయాలంటూ.. స‌వాల్ రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చకు దారితీసింది. గ‌తంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ‌ర్సెస్ ఆర్థర్ పంచాయితీలు ప‌లుమార్లు జ‌గ‌న్ ద‌గ్గర‌కు వెళ్లగా జ‌గ‌న్ వ్యూహాత్మకంగా నియోజ‌క‌వ‌ర్గంలో బైరెడ్డిదే ప్రయార్టీ అని ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో పాటు ఆయ‌న‌కు ఏ ప‌ద‌వి ఇవ్వలేదు. ఇప్పుడు మ‌రోసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జిల్లాలో కీల‌క మంత్రినే టార్గెట్ చేయ‌డంతో ఈ వివాదం కొత్త మ‌లుపు తీసుకోవ‌డం ఖాయంగా ఉంది.

Tags:    

Similar News