మరో యడ్యూరప్పగా మిగులుతారా?

మహారాష్ట్రలో మళ్లీ పవర్ గేమ్ మొదలయింది. అర్థరాత్రి దాటాక రాజకీయ పరిణామాలు మారినట్లే మళ్లీ ఊహించని ట్విస్టులు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉంటాయంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రేపు చెప్పనుంది. [more]

Update: 2019-11-24 16:30 GMT

మహారాష్ట్రలో మళ్లీ పవర్ గేమ్ మొదలయింది. అర్థరాత్రి దాటాక రాజకీయ పరిణామాలు మారినట్లే మళ్లీ ఊహించని ట్విస్టులు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉంటాయంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రేపు చెప్పనుంది. బలపరీక్ష తేదీని కూడా బహుశ సుప్రీంకోర్టు ప్రకటించే అవకాశముంది. అయితే ఈ నేపథ్యంలో బలపరీక్ష జరిగితే మరో కర్ణాటక లాగా రాజకీయం మారనుందా? యడ్యూరప్ప బలపరీక్షకు ముందే రాజీనామా చేసినట్లు ఫడ్నవిస్ కూడా చేయాల్సి వస్తుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

రేపు సుప్రీం తీర్పు….

బలపరీక్షకు గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకూ గడువు విధించడంతో కొంత ఊరట చెందింది భారతీయ జనతా పార్టీ. ఈలోపు ఎమ్మెల్యేలను సమీకరించుకోవచ్చని భావించింది. అయితే సుప్రీంకోర్టుకు వివాదం చేరడంతో న్యాయస్థానం ఎప్పడైనా బలపరీక్షకు ఆదేశించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ బలపరీక్షలో నెగ్గుతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ ఎమ్మెల్యేలను కట్టడి చేశారు.

బలాబలాలివీ…..

మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44, ఇతరులు 29 మంది ఉన్నారు. ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో 36 మంది ఉన్నట్లు తేలింది. ఆయన నిర్వహించిన ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశానికి 36 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 18 మంది అజిత్ పవార్ తో ఉన్నట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. బీజేపీకి ఉన్న బలంతో 18 మంది చేరినా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర సభ్యుల మద్దతును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 21 మంది సభ్యుల మద్దతు బీజేపీకి అవసరమవుతుంది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మాత్రం తమ వద్ద 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు.

టెక్నికల్ గా…..

అంతమంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతిస్తారా? అన్నది సందేహమే. అయితే ఇక్కడ బీజేపీ ధీమాగా ఉండటానికి మరొక కారణం ఉందంటున్నారు. అజిత్ పవార్ ను సస్పెండ్ చేసినా ఆయనే ఎన్సీపీ శాసనసభపక్ష నేతగా టెక్నికల్ గా ఉన్నారు. బలపరీక్ష సమయంలో అజిత్ పవార్ జారీచేసే విప్ కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాల్సి ఉంటుందంటున్నారు న్యాయనిపుణులు. బీజేపీ ఈ ధీమాలో ఉండగా, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన నేత సంజయ్ రౌత్ చెబుతున్నారు. మొత్తం మీద లెక్కలు ఎలా ఉన్నా బలపరీక్ష జరిగితే కర్ణాటక తరహా సీన్ రిపీట్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే అన్ని పార్టీలూ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాయి.

Tags:    

Similar News