Nellore : కావాలంటున్న బీజేపీ.. కుదరదంటున్న జనసేన…?

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ, జనసేనలు సిద్దమవుతున్నాయి. రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. పొత్తుల చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు పార్టీలు [more]

Update: 2021-11-04 05:05 GMT

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ, జనసేనలు సిద్దమవుతున్నాయి. రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. పొత్తుల చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే, ఒంటరిగా పోటీ చేసే తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు తగ్గే అవకాశాలున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ లో ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటుపై కసరత్తును ప్రారంభించాయి.

కొంత బలంగానే…

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో జనసేన, బీజేపీలు కొంత బలంగానే ఉన్నాయని చెప్పాలి. గతంలో నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. అలాగే బీజేపీ కూడా ఇక్కడ బలంగానే ఉంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా ఏర్పాటు చేసిన ఓటు బ్యాంకు బీజేపీకి ఉంది. ఇక్కడ బీజేపీ కార్యక్రమాలు కూడా చురుగ్గానే సాగుతుంటాయి. మరో వైపు మెగా ఫ్యామిలీ అభిమానులు సయితం లెక్కకు మించిగానే ఉన్నారు.

నలభై డివిజన్లు కావాలంటున్న…

ఈ కోణంలో రెండు పార్టీలు కలిస్తే కొన్ని డివిజన్లలో సత్తా చాటతాయన్న లెక్కలు వేస్తున్నాయి. అందుకే పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నారు. 54 డివిజన్లున్న నెల్లూరు కార్పొరేషన్ లో దాదాపు నలభై స్థానాలను జనసేన కోరుతుంది. అయితే అన్ని స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదు. బలమైన స్థానాల్లోనే పోటీ చేయాలని, ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములతో సీట్ల పంపకం జరగాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

కుదరదంటున్న బీజేపీ…

దీనికి జనసేన నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే డివిజన్లలో తామే పోటీ చేస్తామని, తమకు నలభై స్థానాలను ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి పొత్తులు కుదిరే అవకాశాలున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ తన అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. టీడీపీ కూడా ఈరోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News