అంతా వేస్ట్ అయిపోయినట్లేనా….??

తాను పెట్టుకున్న నియమాలకు నీళ్లొదిలి..ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీసినా ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది బీజేపీకి. కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. పరిస్థితులు వికటిస్తున్నాయి. జాతీయవాదం, రామమందిరం, [more]

Update: 2019-03-02 16:30 GMT

తాను పెట్టుకున్న నియమాలకు నీళ్లొదిలి..ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీసినా ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది బీజేపీకి. కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. పరిస్థితులు వికటిస్తున్నాయి. జాతీయవాదం, రామమందిరం, పాకిస్తాన్ తో వైరం, రైతు సాయం వంటివేమీ ఈ ఎన్నికలకు కలిసిరాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చివరిక్షణాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు నిరాశ పరుస్తున్నాయి. మళ్లీ రామమందిర నినాదంతో ఉత్తరప్రదేశ్ ను దున్నేయవచ్చనుకుంటే కోర్టుల వాయిదాలు ఆశలను కొడిగట్టించేస్తున్నాయి. రైతుసాయం పేరిట డబ్బులిచ్చేందుకు పూనుకుంటుంటే ఆమాత్రం సాయమేనా? అని వెక్కిరింపులు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ తో వైరం ఫలిస్తుందేమోననుకుంటే అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో దాయాది తగ్గిపోవడంతో సానుభూతి అటువైపు మొగ్గుతోంది. ఉద్రిక్తతలు పెంచి పోషించడం సాధ్యం కావడం లేదు. వీటన్నిటికీ తోడు కమలనాథుల అత్యాశ సామాన్యుల కన్నెర్రకు కారణమవుతోంది. ఈ అయిదు సంవత్సరాల్లో మా జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏం చేశారని మధ్య తరగతి ప్రశ్నిస్తే మౌనమే సమాధానమై నిలుస్తోంది.

యుద్ధమేఘాలు శుద్ధ వేస్టు…

గడచిన పక్షం రోజులుగా పాక్ , భారత్ ల మధ్య ప్రచ్చన్న యుద్ధ వాతావరణం శ్రుతిమించి ప్రత్యక్షయుద్ధానికి దారితీసేంత తీవ్రత చోటు చేసుకుంది. దాయాది దేశంపై ప్రజల్లోనూ కాసింత ఆగ్రహావేశాలున్నాయి. పుల్వామా దాడి తర్వాత ఎంతగానో యోచించి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. వందలమంది చనిపోయారంటూ భారత్ క్లెయిం చేస్తున్నప్పటికీ తటస్థ వర్గాల నిర్ధారణ లేదు. అసలు చావులే లేవంటూ పాకిస్తాన్ ఖండించింది. అంతర్జాతీయ మీడియా సైతం అంతపెద్ద తీవ్రత ఏమీ లేదంటూ కొట్టిపారేస్తోంది. పైపెచ్చు యుద్ధ పైలట్ అభినందన్ పట్టుబడ్డాడు. ఈ ఎపిసోడ్ సుదీర్ఘకాలం కొనసాగితే బీజేపీకి కలిసివచ్చి ఉండేది. అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ అభినందన్ ను విడుదల చేసేసింది. అదే ఇప్పుడు భారత్ కు నెగటివ్ గా పరిణమించింది. చైనా, అమెరికా సహా అన్నిదేశాలు భారత్, పాకిస్తాన్ లు సంప్రతింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. పాకిస్తాన్ తీసుకున్న చర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఏరకమైన దుందుడుకు చర్య తీసుకున్నా అది ఇండియాపై అంతర్జాతీయ ఒత్తిడికి దారి తీస్తుంది.

ఏపీలో ఎదురీతే…

విభజన చట్టంలోని హామీలను అరకొర తీర్చేందుకు పూనుకుని అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవాలనుకుంటున్న యత్నాలు సైతం ఆశించిన విధంగా లాభించడం లేదు. నాలుగేళ్లపాటు ఊరించి ఇచ్చిన రైల్వే జోన్ పై ఏవర్గాలు సంత్రుప్తిగా లేవు. విశాఖ రైల్వే డివిజన్ ను రద్దే చేసేయడం పట్ల ఆ ప్రాంతీయులు సెంటిమెంట్ ఫీలవుతున్నారు. అందులోనూ ఆదాయమొచ్చే విశాఖ రైల్వే డివిజన్ భాగాన్నంతటినీ ఒడిసాకు ఇచ్చేయడమూ వారికి రుచించడం లేదు. దాంతో నాతిని చేయబోతే కోతి తయారైనట్లుగా మారింది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. వైసీపీ తన ఆందోళనల ఫలితమే జోన్ అంటూ ఈ క్రెడిట్ ను తన కాతాలో వేసుకోవాలని చూసింది. ప్రజలలో తగినంత సానుకూలత లేదని గ్రహించి క్రమేపీ తన వాయిస్ ను తగ్గించేసింది. కాంగ్రెసు ఎలాగూ కారాలు,మిరియాలు నూరుతోంది. బీజేపీ పేరు చెబితే జనసేన శివాలెత్తుతోంది. వీటన్నిటినీ సమర్థంగా బీజేపీ నాయకులు కౌంటర్ చేయలేకపోతున్నారు. వారి వాదన చాలా పేలవంగా మారింది. ఇంత చేసినా ఏపీలో ఎదురీతేనా? అంటూ అగ్రనాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారవచ్చని బోర్లాపడిన కాంగ్రెసు పరిస్థితే బీజేపీకి ఎదురుకావచ్చంటున్నారు.

రైతు సాయం రాష్ట్రాల ఖాతాలో..

రైతు సాయం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభావం చూపవచ్చనుకున్న కేంద్రం ఆశలు సైతం నెరవేరేలా లేవు. ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ ను తన కాతాలో వేసేసుకుని రైతుకుటుంబానికి పదిహేనువేల రూపాయల సాయమంటూ ప్రచారం మొదలుపెట్టింది. అందులో ఆరువేల రూపాయలు కేంద్రానివే. తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంటే కుటుంబానికి ఆరువేల సాయం ఏ మూలకూ రాదు. అందులోనూ సవాలక్ష నిబంధనలు. ’ఆదాయపు పన్ను కట్టకూడదు. వ్రుత్తినిపుణులై ఉండకూడదు. రేషన్ కార్డు ద్వారా పేదలుగా ముద్ర పడి ఉండాలి.‘ వంటి కేంద్ర షరతుల కారణంగా లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగా కుదించుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని 53 లక్షల మంది రైతులకు అందిస్తోంది. కేంద్రప్రభుత్వ జాబితాలో అర్హుల సంఖ్య 25 లక్షలే. అలాగే ఏపీలోనూ 60 లక్షలకు పైగా రైతులుంటే కేంద్రం చిట్టా 24 లక్షలు దాటడం లేదు. పథకం ప్రయోజనం పొందినవాడు ఓటు వేస్తాడో లేదో తెలియదు. కానీ తమను విస్మరించారన్న సంగతిని సాయం పొందని రైతులు కచ్చితంగా పరిగణనలోకి తీసుకుని వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయం. జనాభాలో వారి సంఖ్యే అధికం. ఇది ప్రతికూల ఫలితాన్ని అందించవచ్చు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ బీజేపీ ప్రభుత్వానికి చెడు సంకేతాలే పంపుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News