సేఫ్ కాదటగా

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నియామకంలో కసరత్తు ప్రారంభమయింది. తెలంగాణ బీజేపీకి కొత్త సారధిని తీసుకువస్తారా? లేక పాత అధ్యక్షుడినే కొనసాగిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. [more]

Update: 2019-11-27 09:30 GMT

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నియామకంలో కసరత్తు ప్రారంభమయింది. తెలంగాణ బీజేపీకి కొత్త సారధిని తీసుకువస్తారా? లేక పాత అధ్యక్షుడినే కొనసాగిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్టానం సిద్ధమయింది. ఈ మేరకు పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరపనుంది.

నాలుగేళ్ల తర్వాత…..

తెలంగాణ బీజేపీలోకి కొత్త రక్తం వచ్చి చేరంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి సీనియర్ నేతలు వచ్చి చేరారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాల్లో పార్టీ గెలవడంతో వచ్చే శాసనసభ ఎన్నికల కోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు లక్ష్మణ్ అందరినీ కలుపుకుని వెళుతున్నప్పటికీ ఆయనపై అసంతృప్తులు ఉన్నాయి.

అభిప్రాయ సేకరణ….

దీంతో అధిష్టానం కొత్త అధ్యక్షుడి నియామకంపై అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. అధిష్టానం పరిశీలకుడిగా కృష్ణదాస్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కొత్త అధ్యక్షుడిగా పనిచేసేందుకు అనేక మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి వంటి నేతలు తాము అధ్యక్ష బాధ్యతలను చేపడతామంటున్నారు. ఈసారి అధ్యక్ష పదవి విషయంలో సామాజిక కోణంలోనూ చూడాలని అధిష్టానం భావిస్తుంది.

లక్ష్మణ్ నే కొనసాగించాలంటూ….

అయితే కొత్తగా బీజేపీలోకి వచ్చిన నేతలు మాత్రం లక్ష్మణ్ ను అధ్యక్షుడిగా కొనసాగించాలని కోరుతున్నారు. ఈ మేరకు అధిష్టానం పంపిన పరిశీలకుడితో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత ఇవ్వాలని అధిష్టానం కోరుతోంది. లక్ష్మణ్ ను కొనసాగిస్తే పార్టీని ముందుకు తీసుకెళ్లలేరేమోనన్న సందేహం కలుగుతోంది. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థి ఎంపికలో లక్ష్మణ్ స్పీడ్ గా నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే డిపాజిట్ దక్కలేదంటున్నారు. మొత్తం మీద లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారా? లేదా? అన్నది ఈ నెలాఖరుకు తేలనుంది.

Tags:    

Similar News