పక్కా ప్లాన్ తోనేనా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. నామినేషన్ వేసే సమయంలోనూ ఆయన చాలా సేపు వెయిట్ [more]

Update: 2020-01-25 16:30 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. నామినేషన్ వేసే సమయంలోనూ ఆయన చాలా సేపు వెయిట్ చేశారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి దాదాపు 93 మంది బరిలో ఉన్నారు. ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారన్నది పక్కన పెడితే అరవింద్ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడానికే బీజేపీ వ్యూహాన్ని రచించినట్లు స్పష్టమవుతుంది.

కొరకరాని కొయ్యగా…..

అరవింద్ కేజ్రీవాల్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తొలిసారి నెలన్నర రోజులు మాత్రమే అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తర్వాత రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచారు. బీజేపీ మూడు స్థానాలకే పరిమితమయింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ గత ఐదేళ్ల నుంచి మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రతి అంశంలోనూ అరవింద్ కేజ్రీవాల్ మోదీ ప్రభుత్వానికి సవాల్ గా మారారు.

ఆయనను ఓడించేందుకు…..

ఈనేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఓడించాలని బీజేపీ వ్యూహానికి తెరతీసింది. ఎక్కువ మంది నామినేషన్లు వేయడం వెనక బీజేపీ ప్రమేయం ఉందని ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నామినేషన్ వేయడానికి వచ్చేసరికే దాదాపు 45 మంది ఆయన ముందు నిలబడి ఉండటాన్ని చూస్తే పక్కా ప్లాన్ గానే బీజేపీ వెళుతుందన్న ఆరోపణలు విన్పించాయి.

గుర్తు గుర్తించలేక…..

ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురయ్యే అవకాశాలున్నాయి. గుర్తులు కూడా పోల్చుకోలేక కేజ్రీవాల్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తు. ఇదే గుర్తుతో పోలిన వాటిని ఈవీఎంల నుంచి తొలగించాలని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతుంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఆటోడ్రైవర్లు, ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ మాజీ ఉద్యోగులు ఉండటం విశేషం. మొత్తం మీద కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టేందుకు ఎక్కువ మంది చేత నామినేషన్లు వేయించారన్న ప్రచారం బాగా వినపడుతోంది.

Tags:    

Similar News