జమిలి ఎన్నికలకు రెడీనా ?

ఒక్క మెతుకుని పట్టుకుంటే చాలు అన్నం అంతా చూడన‌క్కరలేదు అని చెబుతారు. అలాగే దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే మోడీ తప్ప మొనగాడు లేడని తాజాగా బీహార్ [more]

Update: 2020-11-18 15:30 GMT

ఒక్క మెతుకుని పట్టుకుంటే చాలు అన్నం అంతా చూడన‌క్కరలేదు అని చెబుతారు. అలాగే దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే మోడీ తప్ప మొనగాడు లేడని తాజాగా బీహార్ సహా వివిధ రాష్ట్రాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అందులో హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటివి ఉన్నాయి. ఇక సౌత్ లో కర్ణాటక లో బీజేపీ పట్టు బాగానే నిలుపుకుంది. తెలంగాణాలో దుబ్బాక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. దాంతో బీజేపీ శిబిరంలో జోష్ మామూలుగా లేదు అంటున్నారు.

ఆర్ఎస్ఎస్ అజెండా అమలు….

జమిలి ఎన్నికల ముచ్చట బీజేపీకి అలాగే ఉండిపోయింది. బీజేపీ ప్రజాస్వామ్యం కంటే ఏకస్వామ్యాన్నే గట్టిగా నమ్ముతుంది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒక్కడే నాయకుడు ఇలాంటి ఒకటి అంటే బీజేపీకి ఎంతో మోజు. నిజానికి ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం. దేశంలో భిన్న వాదనలు ఉంటే ఐక్యత దెబ్బతింటుందని ఆర్ఎస్ఎస్ నేతలు గట్టిగా భావిస్తారు. దాంతో ఆర్ఎస్ఎస్ రాజకీయ స్వరూపం అయిన బీజేపీ ద్వారానే వీటిని సాకారం చేయాలనుకుంటున్నారు. ఇక బీజేపీకి తొలిసారి వాజ్ పేయి వంటి ఉదార వాది ప్రధాని అయ్యారు. ఆయన 23 పార్టీల సంకీర్ణానికి నాయకత్వం వహించారు కాబట్టి నాడు ఆర్ఎస్ఎస్ అజెండా బయటకు రాలేదు. ఇపుడు మోడీ రూపంలో తమ కోరికల చిట్టా బయటకు తీసి వరసగా నెరవేర్చుకుంటోంది.

ముహూర్తం కన్ ఫర్మ్….

ఇపుడున్న పరిస్థితుల నుంచి గరిష్ట రాజకీయ లబ్దిని పొందేందుకు బీజేపీ ప్రయత్నించకుండా ఉంటే తప్పు చేసినట్లే. అందువల్ల ఆ తప్పు అసలు చేయదు. అందుకే 2022లో జమిలి ఎన్నికలకు రెడీ అవుతుంది అంటున్నారు. దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉన్న వేళ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు కలుపుకుని ఒకేసారి ఎన్నికలకు వెళ్ళి మళ్లీ మోడీని ప్రధానిగా ప్రతిష్టించాలన్న ఆరెసెస్ అజెండా వర్కౌట్ కావడానికి సమయం ఎంతో దూరం లేదు అంటున్నారు.

తెలుగు వెలుగులేనా…?

ఇక తెలుగు రాష్ట్రాలో కూడా పాగా వేయాలని ఉబలాట పడుతున్న బీజేపీకి ఇక్కడ అంతా ప్లస్ అవుతుందా అన్నది ఒక చర్చగా ఉంది. తెలంగాణాలో లిట్మస్ టెస్ట్ గా దుబ్బాక ఫలితం వచ్చింది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా ఇన్నాళ్ళూ సరైన పార్టీ లేకనే జనాలు ఓటు చేయలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు ఆ లోటు భర్తీకి బీజేపీ రెడీగా ఉంది కాబట్టి తెలంగాణాపైన ఆశలు భారీగా పెంచుకోవ‌చ్చు. అదే ఏపీలో జగన్ మీద మోజు తగ్గిందా లేక‌ అలాగే ఉందా అన్న దానికి కొలమానం తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు, అలాగే త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ రెండూ చూసుకుని ఏపీలో రాజకీయ అవసరాలు, అవకాశాలు బీజేపీ బేరీజు వేసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి 2021లో బీజేపీ దూకుడు ఇలాగే సాగితే మాత్రం 2022 జమిలి ఎన్నికలు జరగడం ఖాయం. అంతే కాదు, దేశంలో అధ్యక్ష తరహా పాలనకు కూడా బీజాలు పడడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News