ఇక ఫోకస్ దానిపైనేనట

ఆంధ్రప్రదేశ్ నూతన బిజెపి రధసారధి కోసం అధిష్టానం కసరత్తు వేగవంతం చేసింది. పార్టీని పరుగులు పెట్టించే దమ్మున్న నేతను ముందు పెట్టి అధికార, విపక్ష పార్టీలకు వచ్చే [more]

Update: 2020-01-16 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన బిజెపి రధసారధి కోసం అధిష్టానం కసరత్తు వేగవంతం చేసింది. పార్టీని పరుగులు పెట్టించే దమ్మున్న నేతను ముందు పెట్టి అధికార, విపక్ష పార్టీలకు వచ్చే ఎన్నికల నాటికి షాక్ ఇవ్వాలన్నది కమలం వ్యూహం. అందులో భాగంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అన్న అంశంపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. తాను వున్నది కేవలం ఏడాది కాలమే కనుక మరో ఏడాది అవకాశం కల్పించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అయితే దీన్ని ఎంతవరకు పార్టీ పరిగణలోనికి తీసుకుంటుందో చూడాలి.

రేస్ గట్టిగానే వుంది…

ఏపీ బిజెపికి అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినా అధ్యక్ష పదవికి మాత్రం రేస్ లో చాలామందే నిలిచారు. వీరిలో ఎప్పటినుంచో ఈ పదవికి తగిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కిన ఎమ్యెల్సీ సోము వీర్రాజు ముందు వరసలో వున్నారు. ఆయన తరువాత స్థానంలో కన్నా లక్ష్మి నారాయణ, మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్యెల్సీ మాధవ్, విష్ణుకుమార్ రాజు లు వున్నారు. వీరిలో ఒకరిని అధిష్టానం ఎంపిక చేస్తుందా? లేక అనూహ్యంగా మరో కొత్త మొహాన్ని పరిచయం చేస్తుందా? అన్నది త్రి మ్యాన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ పై ఆధారపడి వుంది. ఇప్పటికే అధిష్టానం నియమించిన అనిల్ జైన్ ఎవరు ది బెస్ట్ అనే అంశంపై పార్టీలోని వివిధ వర్గాలనుంచి అభిప్రాయాలను సేకరించారు.

సోము దూకుడు తగ్గించారు …

గత ఎన్నికల ముందు పార్టీ ఏపీ సారధ్య బాధ్యతలు దక్కినట్లే దక్కి వెనక్కి పోవడంతో సోము వీర్రాజు కొంత అలక వహించారు. అయితే అధిష్టానం ఆయన్ని బుజ్జగించడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి అవకాశం ఆయనకు దక్కుతుందా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరం గా మారింది. వాస్తవానికి వీర్రాజు అన్ని విధాలా ఈ పదవికి అర్హుడే. ఆర్ఎస్ఎస్ భావజాలం, పార్టీ పట్ల విధేయత ఆయనకు వున్న ప్లస్ పాయింట్లు. అయితే బిజెపి లోనే వుంటూ టిడిపికి అనుకూలంగా వ్యవహరించే కొందరు వీర్రాజు కి కీలక బాధ్యతలు దక్కకుండా అడ్డుపడుతూ విజయం సాధిస్తున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో వుంది. ఈసారి కూడా ఆ టీం సోము కి చెక్ పెట్టె పనిలోనే బిజీగా వున్న నేపథ్యంలో ఆయనకు ఈ పోస్ట్ అందని ద్రాక్షగా ఉంటుందా లేక అధిష్టానం పార్టీ ని నమ్ముకున్నవారికే న్యాయం చేస్తుందా అన్నది చూడాలి.

పురంధరేశ్వరి కి ఛాన్స్ …

అధ్యక్ష బాధ్యతలకు పురంధేశ్వరికి అవకాశాలు మెండుగానే వున్నాయి. ఎన్టీఆర్ తనయగా, రాజకీయ అనుభవం మెండుగా వున్న మహిళగా ఆమెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అయితే పార్టీలు మారే వ్యక్తిగా ఉండటంతో ఆ కోణం పరిశీలిస్తే మాత్రం పురంధేశ్వరిని అధిష్టానం ఈ పదవికి దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్యెల్సీ మాధవ్, మాజీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు లు సైతం అధ్యక్ష పదవికి రేసులో వున్నారు. వీరిద్దరి పనితీరు బాగానే ఉండటంతో అధిష్టానం ఆ దిశగా కూడా ఆలోచన చేస్తుందంటున్నారు. పూర్తిగా పార్టీకి బద్ధులుగా ఉండటం ఆర్ఎస్ఎష్ భావాజాలం వున్నవారు కావడంతో వీరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తుంది.

Tags:    

Similar News