తిరుపతిని అసలు వదలరటగా ?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ హై స్పీడ్ పాలిటిక్స్ తీరు చూస్తూంటే ఏపీలో రేపు జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఎంతలా హీటెక్కబోతోందో సులువుగానే [more]

Update: 2020-12-05 05:00 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ హై స్పీడ్ పాలిటిక్స్ తీరు చూస్తూంటే ఏపీలో రేపు జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఎంతలా హీటెక్కబోతోందో సులువుగానే ఊహించుకోవచ్చు. తిరుపతిలో బీజీపీ అపుడే పట్టు పెంచుతోంది. తన చేతిలోకి ఒక ఎంపీ సీటు వచ్చేసినట్లేనని కూడా లెక్క వేసుకుంటోంది. నిజానికి తిరుపతిలో గత ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు దాదాపుగా పదహారు లక్షలు ఉంటే అందులో కేవలం పదహారు వేల ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. అంటే ఒక్క శాతం ఓటింగ్ మాత్రమే అన్న మాట. మరి 99 శాతం ధీమా ఆ పార్టీకి ఎలా వచ్చింది అంటే అదే రాజకీయ తమాషా.

రాజకీయ మోళీతో ….

గ్రేటర్ ఎన్నికలు అంటే లోకల్ పాలిటిక్స్ మాత్రమే అని అంతా అనుకున్నారు. నిజంగా చూసినా అదే మరి. ఒక స్థానిక సంస్థ ఎన్నికకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్దా వచ్చాడు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక పర్యటన వంకతో తన ప్రెజెంట్ వేసుకున్నారు. అమిత్ షా వంటి వారు ఒక రోజంతా కేటాయించారు. ముఖ్యమంత్రి యోగి వంటి వారు సందడి చేశారు. ఇక కేంద్ర మంత్రులకు సీనియర్ లీడర్లకు కొదవే లేదు. ఇంతకీ అక్కడ బీజేపీ గెలుస్తుందా అంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేరు, గెలుపోటములు పక్కన పెడితే బీజేపీ ఆంతర్యం ఏంటి అంటే జనాన్ని మోళీ చేసి తన వైపు తిప్పుకోవ‌డం. గ్రేటర్ రూట్లో వెళ్ళి సీఎం సీటుకు గురి పెట్టడం.

కేసీఆరే ఉక్కిరిబిక్కిరి …

రాజకీయ ఉద్దండ పిండం కేసీయార్ తన పొలిటికల్ కెరీర్ లో తొలిసారి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సాధారణంగా కేసీయార్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఆయన అసలు ప‌ట్టించుకోరు, అయితే కొడుకు. లేకపోతే మేనల్లుడు కి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు. గతసారి గ్రేటర్ ఎన్నికల వేళ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఊరుకున్న కేసీయార్ ఈసారి బహిరంగ సభ పేరిట రంగంలోకి దూకారంటేనే బీజేపీ పెడుతున్న పొలిటికల్ టార్చర్ ఏంటో అర్ధమైపోతోందిగా.

జగన్ జాగ్రత్త …?

ఇక ఏపీలో చూసుకుంటే జగన్ జర జాగ్రత్త అని రాజకీయ విశ్లేషకులే అనాల్సివస్తోంది. ఇదే రకమైన భావన కూడా బీజేపీ నేతల్లో ఉంది. కేసీఆరే మాకు లెక్క కాదు, జగన్ ఎంత అంటున్నారుట. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ ఎన్నికకు ఆ ఎన్నికే ఒక టఫ్ జాబ్. ఒకచోట గెలిచామని రెండవదీ అలాగే జరుగుతుంది అనుకుంటే పొరపాటే. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది బీజేపీ రాజకీయ ఆకలి. దాని ఎన్నికల నిర్వహణా చాతుర్యం. జనాల్లో లేని దాన్ని ఉన్నది చేసి చూపెట్టే భయంకరమైన బిల్డప్. ఇవన్నీ కూడా సగటు జనాన్ని కనుక కట్టిపడేస్తే అపుడే సీన్ మారుతుంది. ఉల్టా సీదా అవుతుంది. అందువల్ల ఇవాళ గ్రేటర్ రేపు తిరుపతి. ఇక అది రాజకీయ పుణ్య క్షేత్రమే అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఓడినా గెలిచిటేంటంత సీన్ క్రియేట్ చేసే కాషాయం తో వైసీపీ వేగాల్సిందే మరి.

Tags:    

Similar News