“బండి” కి బ్రేకులు పడుతున్నాయా?

తెలంగాణ బీజేపీకి కష్టాలు తప్పేట్లు లేదు. ఒక నేతను పార్టీలో చేర్చుకోవడంతో ఇద్దరు లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇది అధికార పార్టీ చేస్తున్న కుట్ర [more]

Update: 2021-07-27 09:30 GMT

తెలంగాణ బీజేపీకి కష్టాలు తప్పేట్లు లేదు. ఒక నేతను పార్టీలో చేర్చుకోవడంతో ఇద్దరు లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇది అధికార పార్టీ చేస్తున్న కుట్ర అని బీజేపీ ఆరోపిస్తున్నా బీజేపీ లో ఉన్న నేతలు మాత్రం పార్టీ వైఖరి పట్ల సంతృప్తి కరంగా లేరన్నది వాస్తవం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి అనేక మంది నేతలను పార్టీలో చేర్చుకున్నారు. కానీ వారికి ప్రయారిటీ ఇవ్వడంలో మాత్రం పార్టీ నాయకత్వం ఫెయిలయింది.

నాడు రెచ్చిపోయి….

ఒకనాడు కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సమయంలో బీజేపీ రెచ్చిపోయింది. కాంగ్రెస్ త్వరలో ఖాళీ అవుతుందని బీరాలు పలికింది. టీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ వైపు నేతలు క్యూ కడతారని డప్పాలు కొట్టింది. అయితే దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి బీజేపీలో చేరికలు లేవు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించినప్పటికీ బీజేపీ వైపు ఏ నేత మొగ్గుచూపడం లేదు.

పోతూ పోతూ….

పైగా ఉన్న నేతలే పార్టీని వదిలి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు బీజేపీని వీడివెళ్లిపోయారు. పోతూ పోతూ పార్టీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దళిత నేతగా ముద్రపడిన మోత్కుపల్లి నరసింహులు రాజీనామా బీజేపీకి ఇబ్బంది అనే చెప్పాలి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మోత్కుపల్లి బీజేపీలో దళితులకు చోటు లేదంటూ విమర్శలు చేశారు.

టీఆర్ఎస్ లోకి వెళుతూ….

ఇక తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణం పార్టీ నాయకత్వం వైఖరి అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇద్దరు నేతలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. త్వరలో వీరు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయం. అయినా బీజేపీలో గత కొంతకాలంగా చేరికలు లేకపోవడం, ఉన్న వాళ్లు గుడ్ బై చెబుతుండటంతో పార్టీకి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి ఇది సవాల్ గానే చెప్పుకోవాలి.

Tags:    

Similar News