టైమ్ ఫ్రేమ్ చేసి మరీ కొట్టేస్తారా?

వరసగా రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్న భారతీయ జనతా పార్టీ వచ్చిన ఏ ఒక్క అవకాశమూ వదలడం లేదు. గోవా నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకూ [more]

Update: 2020-07-19 17:30 GMT

వరసగా రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్న భారతీయ జనతా పార్టీ వచ్చిన ఏ ఒక్క అవకాశమూ వదలడం లేదు. గోవా నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకూ కమలం జైత్రయాత్ర కొనసాగుతూనే వస్తుంది. అధికారంలోకి రాకున్నా వెయిట్ చేసి వశం చేసుకోవడం బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ ను తన అధీనంలోకి తెచ్చుకుంది. రాజస్థాన్ పై కన్నేసింది.

వెయిట్ చేసి వశం…..

కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేపట్టడానికి బీజేపీకి పథ్నాలుగు నెలల సమయం పట్టింది. దానికి కొద్దిగా అటు ఇటుగా మధ్యప్రదేశ్ ను చేజిక్కించుకుంది. ఇప్పుడు రాజస్థాన్ వైపు చూస్తుంది. బలం ఉన్న నేతలను తమ వైపునకు తిప్పుకుని అధికారాన్ని దక్కించుకుంటున్న బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటన్న చర్చ జరుగుతుంది. రాజస్థాన్ లో సక్సెస్ అయితే తర్వాత కమలం ప్రయాణం మహారాష్ట్ర వైపే నంటున్నారు.

తర్వాత మహారాష్ట్ర…..

మహారాష్ట్రలో నిజానికి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడాల్సి ఉంది. బీజేపీ, శివసేన పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ సీఎం పదవి కొర్రీ తో ఆ బంధానికి బీటలు వారింది. ఇక్కడ కాచుక్కూర్చుని ఉన్న కాంగ్రెస్ శివసేన, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమిని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఇప్పుడు బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంది. ఈ కూటమి నుంచి సీనియర్ నేత శరద్ పవార్ ను తప్పించాలన్న వ్యూహంలో ఉందంటున్నారు.

శరద్ పవార్ కు గాలం….?

అందుకే ఇటీవల కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే కూడా శరద్ పవార్ కు ఎన్డీఏలోకి రావాలని సూచించారు. గత కొద్ది రోజులుగా శరద్ పవార్ కు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు మధ్య పొసగడం లేదు. లాక్ డౌన్ మినహాయింపుల విష‍యంలోనూ, మరికొన్ని కీలక నిర్ణయాల్లో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో శరద్ పవార్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో బీజేపీ ఉందని తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీ నెక్ట్స్ టార్గెట్ మహారాష్ట్ర అన్న టాక్ బాగా విన్పిస్తుంది.

Tags:    

Similar News