బీజేపీకి అక్కడ భారీ లోటు… ?

ఏపీ బీజేపీ పరిస్థితి అందరికీ తెలిసిందే. కమిట్ మెంట్ తో పనిచేసే నాయకులు కొద్ది మందే ఉన్నారు. ఇక క్యాడర్ కూడా అంతే ఉంది. ఈ పరిస్థితుల్లో [more]

Update: 2021-09-06 03:30 GMT

ఏపీ బీజేపీ పరిస్థితి అందరికీ తెలిసిందే. కమిట్ మెంట్ తో పనిచేసే నాయకులు కొద్ది మందే ఉన్నారు. ఇక క్యాడర్ కూడా అంతే ఉంది. ఈ పరిస్థితుల్లో సీనియర్లను హై కమాండ్ వరసబెట్టి రాజ్యంగ బద్ధ పదవులలో నియమిస్తోంది. కొత్తగా పార్టీ విస్తరించడంలేదు. మరి ఉన్న వారితోనే బీజేపీ కధ నడిపిస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ జిల్లాలో కీలక నేత, గిరిజన నాయకుడు లోకుల గాంధీ అకస్మాత్తుగా మరణించడం పార్టీకి తీరని లోటు అంటున్నారు. ఆయన ఐఐటీ పట్టభద్రుడు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా ఉండాల్సిన లోకుల గాంధీ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై చాలా కాలంగా ఆ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్ర స్థాయిలో కీలకమైన నాయకులలో ఒకరుగా ఉన్నారు.

ఏజెన్సీ గొంతుగా..?

లోకుల గాంధీ విశాఖ ఏజెన్సీలో బీజేపీకి పెద్ద గొంతుకగా ఉన్నారు. సాధారణంగా గిరిజనం బీజేపీకి దూరంగా ఉంటారు. వారి విశ్వాసాలు నమ్మకాలు వేరు, బీజేపీ ఐడియాలజీ వేరు. అటువంటి చోట ఏటికి ఎదురీది బీజేపీ వైపుగా గిరిజనాన్ని తీసుకురావడంతో లోకుల గాంధీ బాగానే విజయవంతం అయ్యారు. ఆయన 2014 ఎన్నికలలో పాడేరు అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేసి 17 వేల పై చిలుకు ఓట్లు బీజేపీకి తెచ్చిపెట్టారు. 2019లోనూ పోటీ చేశారు కానీ జగన్ వేవ్ లో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయినా కూడా మన్యంలో పార్టీ విస్తరణకు ఆయన బాగా కృషి చేసిపార్టీ పెద్దల మెప్పు పొందారు.

దెబ్బ మీద దెబ్బ …

బీజేపీ పరిస్థితి చూస్తే వరసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖ ఏజెన్సీని మొత్తం దక్షతగా చూసుకునే గాంధీ లేని లోటు తీరనిది అని పార్టీ నేతలు అంటున్నారు. ఆయన అంతిమ యాత్రకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్, రాజ్య సభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు వచ్చారు అంటేనే బీజేపీ ఎంతలా తల్లడిల్లుతోందో అర్ధమవుతోంది. బీజేపీకి మైదాన ప్రాంతంలోనే ఇపుడు గట్టి నేతలు లేరు. ఇక ఏజెన్సీలో ఉన్న వారు కూడా కనుమరుగు అయితే ఎలా అన్నదే కమలనాధులను కలవరపెడుతున్న అంశం.

ఆ వర్గాలకు దూరమే…

ఎస్టీ ఎస్సీ వర్గాలు మొదట కాంగ్రెస్, ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ కే మద్దతుగా ఉంటున్నాయి. టీడీపీ సైతం వారి మన్ననలు పొందడంలో విఫలం అవుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీది ఏజెన్సీలో అలుపెరగని పోరాటమనే చెప్పాలి. కానీ నిత్యం ప్రజా సమస్యల మీద తిరిగే విషయంలో బీజేపీ నేతలకు సరిసాటి ఎవరూ రారు. మిగిలిన పార్టీల వారంతా విశాఖలో మకాం పెట్టి చుట్టపు చూపుగా ఏజెన్సీకి వెళ్తారు. కానీ లోకుల గాంధీ లాంటి వారు తాము పుట్టిన ప్రాంతంలోనే ఉంటూ గిరిజనుల కష్టసుఖాలను కలసి అనుభవిస్తున్న వారు. అందుకే వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులకు సాధారణ గిరిజనులు బలి అయినట్లే లోకుల గాంధీ కూడా బలి అయ్యారు. ఇదొక్కటి చాలు ఆయన అసలైన గిరిజన నేత అని చెప్పడానికి. మొత్తానికి సోము వీర్రాజు టీమ్ లో చురుకైన నేతగా ఉన్న గాంధీ వంటి వారు మృత్యువాత పడడం బీజేపీకి షాక్ గా మారింది.

Tags:    

Similar News