బీజేపీ ఏపీలో మరో ప్రయోగానికి సిద్ధమవుతుందా?

ఏపీలో రాజకీయ ప్రయోగాలు ఇంకా చేసేందుకే బీజేపీ రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. రోగం ఎక్కడ ఉందో తెలుసు. మందు మాత్రం అక్కడ వేయకుండా బీజేపీ పడుతున్న పాట్లు [more]

Update: 2021-04-19 00:30 GMT

ఏపీలో రాజకీయ ప్రయోగాలు ఇంకా చేసేందుకే బీజేపీ రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. రోగం ఎక్కడ ఉందో తెలుసు. మందు మాత్రం అక్కడ వేయకుండా బీజేపీ పడుతున్న పాట్లు ప్రత్యర్ధులకు నవ్వు పుట్టిస్తున్నాయి. కానీ ఆ పార్టీ పెద్దలు మాత్రం తమ పార్టీ తమ ప్రయోగాలు అన్న తీరునే ముందుకు సాగిపోతున్నారు. ఏపీలో కాపులు ఎక్కువగా ఉన్నారని కన్నా లక్ష్మీనారాయణని తెచ్చి అర్జంట్ గా ప్రెసిడెంట్ చేశారు. అటు కాంగ్రెస్ కాపులు ఇటు టీడీపీ కాపులు అందరూ ఎగబడతారు అని భావించారు. కానీ అంచనాలు తల్లకిందులు అయ్యాయి.

సోము మోముతో …..

ఇక బీజేపీని అట్టిపెట్టుకుని సుదీర్ఘకాలంగా ఉన్న కార్యకర్త, ఆర్ఎస్ఎస్ నేపధ్యం ఉన్న సోము వీర్రాజు నెత్తిన కమల కిరీటం పెట్టారు. అయితే సోము వీర్రాజు ఏలుబడిలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రతిష్ట ఇంకా దారుణంగా పతనం అవుతోందిట. ఈ మేరకు వచ్చిన సర్వే నివేదికలు చూసి బెంబేలెత్తుతున్న కేంద్ర నాయకత్వం తొందరలోనే సోము వీర్రాజుని మాజీని చేసి కొత్త వారిని పీఠమెక్కించాలని చూస్తోందని టాక్. సోము వీర్రాజుకు మెగా హీరోలతో ఉన్న పరిచయాలు, కాపు కార్డు కలసివస్తాయని భావిస్తే అది కూడా బెడిసికొట్టిందని కాషాయం పెద్దలు ఒక అంచనాకు వచ్చేశారుట.

ఆదికే పట్టం…

ఇక బీజేపీకి రాయలసీమ మీద ఇపుడు హఠాత్తుగా మోజు పెరిగింది. ఇంతకాలం కోస్తా బెల్ట్ ని పట్టుకుని ఓట్ల కోసం చేసిన ఫీట్లు అచ్చిరాలేదని అనుకున్నారో ఏమో కానీ బలమైన నేతకు అధ్యక్ష పదవి అప్పగించాని భావిస్తున్నారుట. ఇక ఏపీలో జగన్ అపరిమిత శక్తిమంతుడిగా మారిపోతున్న నేపధ్యంలో ఆయన్ని ఢీ కొట్టాలంటే సొంత సామాజికవర్గం నుంచే ప్రెసిడెంట్ ని చేయాలని ఆలోచిస్తున్నారుట. ఇక జగన్ సొంత జిల్లా అయితే మరీ మేలు అనుకుని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి పగ్గాలు అప్పగించడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆదినారాయణరెడ్డి తన సొంత ఇలాకాలో పొలిటికల్ గా కొంత పట్టు నిలుపుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను కూడా చూపించారు.

వర్కౌట్ అయ్యేనా…?

బీజేపీ దాదాపు మూడేళ్ళుగా ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. కానీ కలసిరావడంలేదు. దానికి కారణం ఏపీ బీజేపీ నేతలు అనుకుంటోంది. కానీ ఏపీ జనాలు బీజేపీ మీద నమ్మకం పెంచుకోవాలంటే తాను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఏం చేయాలో బీజేపీ మరచిపోయిందని అంటున్నారు. ఇక ఆదినారాయణరెడ్డికి పట్టం కడితే ఆయన జగన్ కి బద్ధ శత్రువు కాబట్టి ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఆదినారాయణరెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఆ విధంగా బాబుతో చెలిమికి బీజేపీ ట్రై చేస్తుందా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి చూస్తే సోము వీర్రాజుకు పదవీగండం పొంచి ఉంది అన్న మాట గట్టిగానే ఉంది మరి.

Tags:    

Similar News