కేసీయార్ ఫస్ట్… జగన్ నెక్స్ట్ …?

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల మీద కన్నేసింది. తనకంటూ ప్రత్యేక ఆపరేషన్ ని కూడా రెడీ చేసి పెట్టుకుంది. తెలంగాణా, ఏపీలలో ఏది ముందు టార్గెట్ చేయాలి [more]

Update: 2021-06-25 11:00 GMT

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల మీద కన్నేసింది. తనకంటూ ప్రత్యేక ఆపరేషన్ ని కూడా రెడీ చేసి పెట్టుకుంది. తెలంగాణా, ఏపీలలో ఏది ముందు టార్గెట్ చేయాలి అన్నదాని మీద బీజేపీ వ్యూహకర్తలకు కచ్చితమైన అంచనాలు ఉన్నాయి. ఎంత కాదన్నా తెలంగాణా బీజేపీకి కొంత బలం ఉంది. మొదటి నుంచి అక్కడ కాషాయం నేతలు ఎక్కువగా నోరు చేసే వారున్నారు. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీకి నాలుగు లోక్ సభ సీట్లు వచ్చాయి. ఈ మధ్యన జరిగిన హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగిన సీట్లు దక్కాయి. దీంతో తెలంగాణా మీద బీజేపీ ఆశలు పెంచుకుంటోంది.

ముఖం మొత్తితే…?

ఇక తెలంగాణాలో చూసుకుంటే ఇప్పటికి రెండు సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఉద్యమ‌ కాలం నాటి ప్రభలు మెల్లగా కరగిపోతున్నాయి. దాంతో 2023 చివరలో జరిగే శాస‌నసభ ఎన్నికల్లో కచ్చితంగా కేసీఆర్ కి గట్టి దెబ్బ పడుతుందని కమలం పార్టీ నాయకులు ఊహిస్తున్నారు. ఆనాటికి కనుక తాము సరైన ఆల్టర్నేషన్ అని రుజువు చేసుకుంటే జనం తమ వైపునకు చూస్తారని కూడా బీజేపీ భావిస్తోంది. తెలంగాణాలో కేసీఆర్ కి ఇపుడు శ్రీరామ రక్ష ఏంటి అంటే అటూ ఇటూ జాతీయ పార్టీలు పోటీగా ఉన్నాయి. ఈ రెండూ కలసి ఒక్కటిగా వస్తేనే ఆయనకు ముప్పు. అందుకే కాంగ్రెస్ ను ముందు నిర్వీర్యం చేస్తే తామే విపక్షంలో పెద్ద కామందు అవుతామని బీజేపీ భావిస్తోంది.

ఇపుడు కాదా ..?

ఇక ఏపీ విషయం తీసుకుంటే జగన్ నిన్న గాక మొన్న వచ్చిన యువ నేత. పైగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఏపీలో చూసుకుంటే బీజేపీకి పునాదులు లేవు. నాయకుల బలం కూడా లేదు. దాంతో ఏపీలో పవర్ లోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు. ఇక దీని మీద ఆరెస్సెస్ నాయకులు కూడా బీజేపీకి ఒక సూచన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ విషయం పక్కన పెట్టి ముందు అధికారం లోకి వస్తామని ఆశలున్న తెలంగాణా మీద దృష్టి సారించాలని కూడా అందుకే బీజేపీ భావిస్తోంది అంటున్నారు. ఇక జగన్, కేసీఆర్ లలో కేసీఆర్ ప్రమాదకారి అన్నది మోడీ షా టీమ్ కి తెలుసుట. అందువల్ల ఆయన మీదనే దండయాత్ర చేపడతారు అంటున్నారు.

టీడీపీకి చిక్కే …?

ఇక ఏపీలో చూసుకుంటే తమకు తాముగా ఎదగాలని బీజేపీ అనుకుంటోంది. దాంతో టీడీపీతో పొత్తులు పెట్టుకోకుండా 2024లో జనసేనతో కలసి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది అంటున్నారు. అంటే బీజేపీ పెద్దల అంచనాల మేరకు 2024 నాటికి టీడీపీ ఖేల్ ఖతం అవుతుందని తెలుస్తోంది. ఆ మీదట అంటే 2029 నాటికి బీజేపీకి ఏపీలో అధికారం దక్కేలా పావులు కదిపితే తమ టార్గెట్ పూర్తి అయినట్లే అన్నదే ఆలొచనట. దీంతో బీజేపీ తెలంగాణాలో కేసీఆర్ ని, ఏపీలో చంద్రబాబుని గట్టిగా గురి పెట్టిందని చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో ఇద్దరు తెలుగు చంద్రులకు కమలంతో కలవరం తప్పదన్నమాట.

Tags:    

Similar News