జైల్లోకి తోసేయ్…పీఠమెక్కేయ్…?

అనుభవం అయితే కానీ తెలియదు అని అందుకే అంటారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు ఏలింది. ఆ సమయంలో వేరే పార్టీ కూడా [more]

Update: 2021-04-16 14:30 GMT

అనుభవం అయితే కానీ తెలియదు అని అందుకే అంటారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు ఏలింది. ఆ సమయంలో వేరే పార్టీ కూడా దరిదాపుల్లో లేకుండా పోయింది. దాంతో వ్యవస్థలను గుప్పిట పట్టేసి కాంగ్రెస్ ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఆ సమయంలోనే ఎమర్జెన్సీ విధించారు. నాడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా లెఫ్ట్ రైటూ సహా అన్ని పార్టీలూ కలసి పోరాడాయి. ఇక జనసంఘ్ ఇతర పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా అవతరించి కాంగ్రెస్ కి తాము ఆల్టర్నేషన్ అని చెప్పాయి. అంతే కాదు కాంగ్రెస్ తప్పులు చేయమని కూడా గట్టిగా ఒట్టేశాయి. జనతా పాలన కూడా ఒక విధంగా బాగానే సాగింది.

తేడా పార్టీగా ….

అయితే కాంగ్రెస్ ఎత్తులకు చిత్తు అయి మూడేళ్ళకే జనతా ఏలుబడి అలా కూలబడిపోయింది. 1980 నాటికి దేశంలో బీజేపీ పేరిట కొత్త పార్టీ ఆవిర్భవించింది. తాము తేడా పార్టీ అని బీజేపీయే చెప్పుకుంది. కాంగ్రెస్ దుష్ట పాలనను తాము దూరం చేస్తామని శపధం చేసి అధికారంలోకి వచ్చింది. ఇపుడు దేశంలో చూస్తే రెండవమారు మోడీ ప్రధానిగా ఉన్నారు. ఇపుడు బీజేపీ తీరు చూస్తే నాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన గుర్తుకు వస్తోంది అని ప్రత్యర్ధులు అంటున్నారంటే తేడా గల పార్టీ తీరు ఇదేనని జనాలు అనుకోవాల్సివస్తోంది.

జనంతో సంబంధం లేదా….?

ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా బీజేపీ దూకుడు మీద ఉంది. దేశంలో మోడీ ఉండగానే అధికారంలోకి రావాలి అంతే అని ప్రతిన పూనినట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య స్పూర్తిని కూడా వీడి మరీ వితండ వాదననే చేస్తున్నారు. కేసీఆర్ ను జైలు లో పెడతామని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అంటే ఏపీలో తిరుపతి ఎన్నికల వేళ ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ డియోధర్ జగన్ ఏ క్షణమైనా జైలుకు పోతారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఇక్కడ కోర్టులతో జనాలతో సంబంధం లేకుండా బీజేపీ తలచుకుంటే ఎవరినైనా జైలుకు పంపించేస్తుందా అన్న సందేహం జనాలకు కలుగుతోంది అంటే తప్పు లేదు కదా.

ఇంకా దూరమే…?

బీజేపీ నేల విడిచి సాము చేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధికారం ఇంకా దూరంగానే జరుగుతుంది. ప్రజా సమస్యలపైన పోరాటం చేయడం జనాలకు దగ్గరగా ఉండడం నేర్చుకుంటేనే అధికారం దక్కేది. అంతే తప్ప పదవిలో ఉన్న వారి మీద కేసులు పెడతామని, వారి బలహీనతల మీద దెబ్బ కొడుతూ పీఠానికి బాటలు వేసుకుంటామని కలలు కంటే మాత్రం కమలనాధులకు కలత తప్ప వేరేది దక్కదు అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి కూడా అధికార మత్తు ఈ స్థాయిలో ఉందా అన్నదే జనాలు విస్తుబోతూ చూస్తున్న నిజం.

Tags:    

Similar News