అక్కడ కూడా ఎర్త్ పెడుతున్నారుగా ?

బాబోయి.. బీజేపీకి బుర్ర నిండా ఆలోచనలే. అయితే కాలం కలసిరావడంలేదు కానీ లేకపోతే ఒంటిచేత్తో ఏపీని ఎత్తుకెళ్ళిపోదూ. నిజానికి వార్డు మెంబర్ కూడా ఇపుడు ఏపీలో బీజేపీకి [more]

Update: 2020-09-22 03:30 GMT

బాబోయి.. బీజేపీకి బుర్ర నిండా ఆలోచనలే. అయితే కాలం కలసిరావడంలేదు కానీ లేకపోతే ఒంటిచేత్తో ఏపీని ఎత్తుకెళ్ళిపోదూ. నిజానికి వార్డు మెంబర్ కూడా ఇపుడు ఏపీలో బీజేపీకి లేదు కానీ ఏకంగా కొండకు వెట్రుకను పెట్టి ముడివేయాలని చూస్తోంది. ఏపీ సీఎం పీఠానికే గురి పెడుతోంది. ఇక బీజేపీకి బోలెడు ఆలోచనలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ వెన్ను విరవాలి అంటే కులం మతం కుడి ఎడమల తేడా లేకుండా ఎడా పెడా వాడేయాలన్నదే బీజేపీ ఆరాటం. అందుకోసం జనసేనను కూడా పక్కన ఉంచుకుని మరీ రాజకీయ‌ వీరంగం వేస్తోంది.

గిరి మంత్రమా……

బీజేపీకి ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టుంది, కానీ ఏపీలో కాదు, జార్ఖండ్, ఒడిషా లాంటి చోట్ల గిరిజనులను తమ వైపు తిప్పుకుని పొలిటికల్ గా ఎన్నో రకాలైన మ్యాజిక్కులు చేసింది. ఇక ఏపీలో కూడా అదే ప్రయోగం చేయాలనుకుంటోంది. ఏపీలో గిరిజనులు పూర్తిగా వైసీపీ వైపు ఉన్నారు. నాలుగు జిల్లాలు విస్తరించి ఏడు ఎస్టీ సీట్లు ఉంటే మొత్తానికి మొత్తం 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. 2014 ఎన్నికల్లోనూ ఇందులో ఆరు వైసీపీ గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఏజెన్సీ గిరిజనులకు కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ అనుబంధం. అలా కాంగ్రెస్ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా వైఎస్సార్ వారు గుండెల్లో దేవుడిగా ముద్ర వేసుకున్నారు.

జగన్ పేరే అలా…..

ఇక్కడొక గమ్మత్తు అయిన విషయం చెప్పాలి. గిరిజనులకు ఎవరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా తెలియదు. వారు ఫోటోలను తీసుకువెళ్ళి మరీ ఎవరో చెప్పమంటే మాకు తెలియదు అంటారు. కానీ వారికి ఇద్దరు ఫోటోలు మాత్రం బాగా గుర్తుపడతారు. అదే వైఎస్సార్, జగన్. అంటే ఈ ఇద్దరి మీద వారికి ఉన్న ప్రేమ, అభిమానం ఏ రేంజిలో ఉందో అర్ధం చేసుకోవాలి. ఇదిలా ఉంటే జగన్ ఏజెన్సీ వస్తే గిరిజనుల స్వాగతం మామూలుగా ఉండదు, పూనకంతో వారు ఊగిపోతారు. ఇక జగన్ బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి వారికి ఇంకా చేరువ అయ్యారు. నిజానికి ఈ బంధాన్ని వేరు చేయడం కష్టమే కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోగం చేస్తోంది.

నోరున్న వారితో…..

బీజేపీకి విశాఖ సహా ఏజెన్సీ ప్రాంతాల్లో ఓట్లు రాలకపోయినా నోరున్న నేతలు నాయకులుగా ఉన్నారు. వారిలో విశాఖ జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లోకుల గాంధీ ఒకరు. ఆయన్ని ఇపుడు బీజేపీ ఏకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసింది. అంటే ఏజెన్సీలో ఇంత స్థాయిలో జాతీయ పార్టీలో పదవి పొందిన వారు లేరు. ఆ విధంగా ఆయన్ని ఫోకస్ చేసి ఏజెన్సీ ఓట్ల వేటకు బీజేపీ రెడీ అవుతోంది. ఇక ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఆదీవాసీలతో ఎపుడూ టచ్ లో ఉంటారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారి బాగోగులు చూడడం ద్వారా చేరువ అవుతూ ఉంటారు. ఇపుడు ఇదే మంత్రంతో ఏజెన్సీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. ఒక విధంగా ఇది అత్యాశే అయినా అక్కడ ఉన్నది బీజేపీ కాబట్టి అసాధ్యం కాబోదని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News