బిగ్ ప్లాన్ ఏంటో…?

ఎట్టకేలకు బీజేపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. ఆయన ఈ నెల 10న రానున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అమిత్ షా [more]

Update: 2019-11-06 13:30 GMT

ఎట్టకేలకు బీజేపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. ఆయన ఈ నెల 10న రానున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అమిత్ షా ఏపీకి రావాలి కానీ ఆయన తొందరలోనే బాధ్యతలు నడ్డాకు అప్పగించనున్న దృష్ట్యా నడ్డాయే పెద్ద దిక్కుగా మారిపోయారు. బీజేపీ నడ్డా గారి తొలి రాష్ట్ర పర్యటన ఏపీ కావడమే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. తొందరలో జార్ఖండ్ ఎన్నికలు జరుగబోతున్నాయి. అక్కడకు నడ్డా వెళ్ళడంలేదు. నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణా టూర్ పెట్టుకోవడంలేదు. మిత్రపక్షం అన్నా డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు కానీ, సొంతంగా అధికారంలో ఉన్న కర్నాటక కానీ నడ్డా టూర్ జాబితాలో లేదు. మరి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఏపీపైనే నడుం బిగించి మరీ నడ్డా వారు నడచి వస్తున్నారంటేనే బీజేపీ బిగ్ ప్లాన్ ఏంటో అర్ధం చేసుకోవాలి.

సగానికి సగమట….

నడ్డా ఏపీ టూర్ అంటేనే టీడీపీ సహా ఇతర పార్టీలు బెదురు చూపులు చూస్తున్నాయి. నడ్డా వచ్చి ఎవరి నడ్డి విరగ్గొడతాడోనని తెగ కలవరపడుతున్నాయి. అయితే టీడీపీ మీదే బిగ్ బాంబ్ వేసేందుకు నడ్డా రెడీ అయి వస్తున్నారని అంటున్నారు. ఏపీకి జాతీయ ప్రెసిడెంట్. అదీ కూడా తొలిసారి రాక దాంతో ధూం ధాం గా అయన టూర్ ఉండాలని అపుడే ఆదేశాలు వచ్చేశాయి. ఇక ఏపీలో ఏం లేదనేవారికి సరైన సమాధానం కూడా ఇక్కడే చూపించాలని కమలనాధులు ఉబలాటపడుతున్నారు. దాంతో టీడీపీనే టార్గెట్ చేస్తున్నారుట. ముఖ్యంగా రాయలసీమ నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నడ్డా టూర్లో పెద్ద ఎత్తున చేరెందుకు రంగం సిధ్ధం చేశారని టాక్. అదే విధంగా కోస్తాలో కూడా బలమైన ఓ సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలను కుంటున్నారు. ఉత్తరాంధ్ర మీద కూడా బీజేపీ కన్ను ఉంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం టీడీపీ నుంచి డజన్ల కొద్దీ బడా నాయకులు నడ్డా సమక్షలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని అంటున్నారు.

కుదేలేనా…?

టీడీపీని ఏదో విధంగా నెట్టుకువస్తే లోకల్ ఫైట్ లో సత్తా చాటుకుని మళ్ళీ ట్రాక్ లోకి వద్దామని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అయితే ఆయన గారి ఆశలకు గండిపెట్టేలా బీజేపీ బిగ్ ప్లాన్ తో దూసుకువస్తోంది. అందుకే టీడీపీతో కలసి ఎక్కడా ఏ వేదిక మీద కూడా కనిపించకూడనుకుంటోంది. బీజేపీ ఒంటరిగానే ఏపీలో బలపడుతుందన్న సంకేతాలు, ఇటు జనానికి, అటు నాయకులకు కూడా చేరాలన్నది ఆ పార్టీ వ్యూహం.

పసుపు శిబిరంపైనే….

ఇక ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అందువల్ల అక్కడ నుంచి ఇపుడిపుడే వలసలు వచ్చే చాన్స్ లేదు. ఇక మిగిలింది టీడీపీనే. దాంతో పసుపు శిబిరంపైనే గురి మొత్తం కమలనాధులు పెట్టేశారు. పనిలో పనిగా జనసేన నుంచి కూడా వచ్చే నాయకులకు ఎర వేస్తున్నారు. మొత్తానికి నడ్డా ఏపీ నుంచి వెళ్ళేలోగా టీడీపీ బలం సగానికి సగం అయిపోవాలంట. దానికోసం ఇప్పటి నుంచే ఫిరాయించే వారి జాబితాను పట్టుకుని మరీ ఏపీ కమలనాధులు తెగ హడావుడి చేస్తున్నారు. ఎవరూ వూహించని బిగ్ షాట్స్ నడ్డా టూర్లో చేరుతారని అంటున్నారు. మరి చంద్రబాబు సైతం కళ్ళప్పగించి చూడాలేమో.

Tags:    

Similar News