బాసలు చెరిగిపోయాయా?

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంత సులువుగా కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీ, శివసేన నేతలు ఎవరూ దిగి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. 2014 [more]

Update: 2019-10-30 16:30 GMT

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంత సులువుగా కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీ, శివసేన నేతలు ఎవరూ దిగి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయకున్నా ఫలితాల తర్వాత కూటమిగా ఏర్పడిన శివసేన, బీజేపీలో ఇప్పుడు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. ఎన్నికలకు ముందే చేసుకున్న బాసలు, ఊసులు సరికాదని చెబుతున్నాయి. దీంతో మిత్రపక్షాల మధ్య వైరం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముంది.

తేల్చేసిన ఫడ్నవిస్….

బీజేపీ 105 స్థానాలతో బలంగా ఉంది. అందుకే తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని గట్టిగా కోరుతుంది. శివసేనకు సీఎం కాదు కదా..? డిప్యూటీ సీఎం ఇచ్చేది లేదని ఫడ్నవిస్ తేల్చి చెప్పేశారు. తాను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థినని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఫడ్నవిస్ వంటి డీసెంట్ లీడర్ ఇలా చెప్పారంటే అది ఆయన వ్యక్తిగతం కాదని అనుకోవాలి. బీజేపీ కేంద్ర నాయకత్వం సూచనలతోనే ఫడ్నవిస్ ఈ ప్రకటన చేసి ఉంటారన్నది వాస్తవం.

ఎన్సీపీని దగ్గర తీసుకునేందుకు….

ఇక బీజేపీ శివసేనను పక్కన పెట్టి నేషనలిస్ట్ కాంగ్రెస్ తోనైనా చేతులు కలిపేందుకు సిద్ధమయింది. నిత్యం శివసేనతో తగవులు ఎందుకన్న ఆలోచనలో బీజేపీ ఉంది. శరద్ పవార్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ కావడం, మహారాష్ట్రలో బలమైన సీట్లు సాధించడంతో శరద్ పవార్ ను కలుపుకుంటే తప్పేంటని బీజేపీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు పవార్ బృందంతో చర్చలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే శరద్ పవార్ తాను ప్రతిపక్షానికి పరిమితమవుతానని చెప్పేశారు.

కాంగ్రెస్ సంకేతాలు….

శివసేన కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఈ ఎన్నికలు ఎప్పటిలాంటివి కాదు. ఉద్ధవ్ థాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రే సీఎం పీఠంపై కూర్చోపెట్టాల్సి ఉంది. ఇప్పుడు తీరకుంటే ఇక భవిష్యత్తులో కష్టమే. అందుకే శివసేన గట్టిగా పట్టుబడుతుందని చెబుతున్నారు. బీజేపీతో తేడా వస్తే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని శివసేన చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అవసరమైతే తాము శివసేనకు మద్దతిచ్చేందుకు రెడీ అన్న సంకేతాలు పంపింది. మొత్తం మీద మిత్రులుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఫలితాల తర్వాత బద్ధ శత్రువులుగా మారాయి. బీజేపీతో చర్చలు జరిపేది లేదని ఇప్పటికే శివసేన తేల్చి చెప్పడంతో మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరగనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

Tags:    

Similar News