దీదీ తర్వాత దొరేనా?

దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ బలపడేందుకు కర్ణాటక తర్వాత అవకాశం ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఫిక్స్ అయ్యారు బీజేపీ నేతలు. అందుకోసమే [more]

Update: 2019-10-22 09:30 GMT

దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ బలపడేందుకు కర్ణాటక తర్వాత అవకాశం ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఫిక్స్ అయ్యారు బీజేపీ నేతలు. అందుకోసమే పట్టు వీడకుండా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాలండర్ ను కూడా రూపొందించుకున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సయితం తెలంగాణలో బెంగాల్ తరహా వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించారు.

నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో…..

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకున్న తర్వాత బీజేపీ మరింత స్పీడ్ పెంచింది. నిన్న మొన్నటి వరకూ కేంద్రప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను చూసీ చూడనట్లు వదిలేసినా నాలుగు ఎంపీ సీట్లు రావడంతో ఇక్కడ బలపడేందుకు అవకాశాలున్నాయని గ్రహించింది. అందుకోసమే బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిందంటున్నారు. మూడు నెలల క్రితం ఇక్కడకు వచ్చిన అమిత్ షా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు.

గవర్నర్ ను మార్చి…..

బలపడేందుకు అనుసరించే వ్యూహంలో భాగంగా తెలంగాణకు తమిళ్ సై ను గవర్నర్ గా నియమించారు. అంతకు ముందు రాజ్ భవన్ వెళ్లేందుకు కూడా సాహసించని బీజేపీ నేతలు ఇప్పుడు పదే పదే వెళుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని గవర్నర్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రపతి ఆరా కూడా తీశారు.

ఫిర్యాదులతో…..

విద్యుత్తు రంగంలో జరిగిన అవకతవకలను కూడా కేంద్రమంత్రి దృష్టిికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మైనింగ్ లో జరిగిన అక్రమాలు, ఐటీ ఎగవేతపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల గవర్నర్ తమిళ్ సై వీటిని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ నేతలు వీటిపై సీబీఐ విచారణకు పట్టుబడుతున్నారు. ఆర్టీసీ సమ్మెలో కూడా బీజేపీ నేతలు పాల్గొని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద బెంగాల్ తరహాలో పట్టుపెంచుకునేలా తెలంగాణలో బీజేపీ రూపొందించిన వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News