నాడి తెలిసిపోయిందా?

తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనపడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ [more]

Update: 2019-09-08 11:00 GMT

తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనపడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీని రాజ్యసభలో బీజేపీలో విలీనం చేసేశారు. అయితే గత కొన్నాళ్లుగా సుజనాచౌదరి, సీఎం రమేష్ లు బీజేపీ కండువా కప్పుకుని ఏపీలో వైసీపీని టార్గెట్ చేశారు. అమరావతి రాజధాని, పోలవరం విషయంలో సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంట్రాక్టరు కావడంతో…..

ఇక సీఎం రమేష్ కూడా అమెరికాలో జగన్ పర్యటిస్తున్నప్పుడు అక్కడ జ్యోతిప్రజ్వలన హిందూ సంప్రదాయం ప్రకారం జరగలేదని ట్వీట్ చేసి వివాదం రేపారు. అయితే సీఎం రమేష్ పోలవరం, రాజధాని విషయంలో పెద్దగా స్పందించలేదు. దీనికి కారణం ఆయన బడా కాంట్రాక్టరు కావడమేనన్న వాదనలూ లేకపోలేదు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నాలుగువేల కోట్ల కాంట్రాక్టు పనులు సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్ దక్కించుకుంది. దీంతో నిర్మాణపనులపై సీఎం రమేష్ పెదవి విప్పడం లేదు.

టీజీ భిన్నంగా….

ఇక మరో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ వందరోజుల పాలనపై ప్రశంసలు కురిపించారు. హామీలను నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు అమరావతిని పక్కన పెట్టి మిగిలిన వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని టీజీ వెంకటేశ్ పిలుపునిచ్చారు. అమరావతిలో తాజ్ మహల్ లు కట్టనవసరం లేదని టీజీ వెంకటేశ్ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలను తప్పుపట్టారు. ఆయనకు బహుశా బీజేపీ నేతల నాడి తెలిసి ఉంటుందని భావిస్తున్నారు.

అందుకేనా సైలెన్స్……

ఎందుకంటే గత వారం రోజుల నుంచి బీజేపీ కీలక నేతలు సైలెంట్ అయ్యారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణలు సయితం పెద్దగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. ఇందుకు కారణం బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలే కారణమని అంటున్నారు. టీజీ వెంకటేష్ టీడీపీ అయినా ఆయనకు బీజేపీలో తక్కువ కాలంలోనే గ్రిప్ దొరికిందంటున్నారు. సామాజిక వర్గమూ ఒక కారణమని చెబుతున్నారు. అందుకే బీజేపీ పెద్దల మనసులో మాటలను గ్రహించిన టీజీ వెంకటేష్ వైసీపీని పొగుడుతున్నారన్నది ఏపీలో విన్పిస్తున్న టాక్. తెలుగుదేశం పార్టీలోనే ఇదేరకమైన చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News