భారత రత్నాల జాబితా పెరుగుతోంది…?

భారతరత్న అంటే చాలా అత్యుత్తమ పౌర సత్కారం. దానికి మించినది మరోటి లేదు. అయితే ఈ ఉత్తమోత్తమమైన బిరుదు దక్షిణాదిన ఎందరికి వచ్చింది. ఎందుకు వచ్చింది అన్నది [more]

Update: 2020-10-03 14:30 GMT

భారతరత్న అంటే చాలా అత్యుత్తమ పౌర సత్కారం. దానికి మించినది మరోటి లేదు. అయితే ఈ ఉత్తమోత్తమమైన బిరుదు దక్షిణాదిన ఎందరికి వచ్చింది. ఎందుకు వచ్చింది అన్నది ఆలోచన చేస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయంటే అర్జంటున్నా అన్నాడీఎంకేతో పొత్తు కోసం అప్పటికి మరణించిన ఎమ్జీయార్ కి భారత రత్న బిరుదు ఇచ్చేశారు. ఎమ్జీయార్ తమిళనాడు పొలిమేరలు దాటి ఎక్కడికీ పోలేదు. సినిమాల్లో కూడా ఆయన తన పరిమితమన పాత్రలతోనే అలరించారు. కానీ రాజకీయం ఆయన్ని భారతరత్నను చేసింది. ఇక సంగీతరంగంలో మహనీయురాలు ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని భారతరత్న వచ్చింది కానీ అంత ప్రతిభామూర్తి అయిన మంగళంపల్లి బాలమురళీక్రిష్ణకు మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఆయనకు ఆ బిరుదు కచ్చితంగా వచ్చి ఉండాల్సింది అని ఆయన మరణం తరువాత అంతా అనుకున్నారు, డిమాండ్ కూడా చేశారు.

బాలూ అర్హుడే …..

ఇపుడు చూసుకుంటే దివంగతుడైన సినీ నేపధ్యగాయకుడు బాలసుబ్రహ్మణ్యం భారతరత్నకు అర్హుడే. ఆయన దాదాపుగా పదహారు భారతీయ భాషల్లో ఎన్నో వేల పాటలు పాడారు. ఆయన అఖిల భారత గాయకుడు. కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మాత్రం కారు. అటువంటి బాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ తాజాగా వచ్చింది. నిజంగా ఒక మనిషి జీవితకాలంలో చేయలేని ఎన్నో పనులకు బాలూ కేవలం 74 ఏళ్ళ వయసులో చేశారు. బాలు బహుముఖీయమైన ప్రతిభాశాలి అని అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు అందరి కంటే లేట్ గానే పద్మశ్రీ, పద్మభూషణ్ వంటివి వచ్చాయన్నది ఇక్కడ మరవరాదు.

వీరంతా కూడా…..

ఈ మధ్యనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణా సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. బహుభాషా కోవిదుడు అయిన పీవీకి ఆ అవార్డు ఇస్తే ఆయన అవార్డుకే గౌరవం అని అంతా అంటారు. ఆయన దేశ ఆర్ధిక ప్రగతి గమనాన్నే మార్చేసిన దిగ్గజ నేత. ఇక సినీ రంగానికి వస్తే ఎన్టీయార్ కి భారత రత్న ఇంకా బాకీ అలాగే ఉంది. మరో మూడు నెలల్లో ఎన్టీయార్ మరణించి పాతికేళ్ళు పూర్తి అవుతాయి. నాటి నుంచి అది వట్టి డిమాండ్ గానే ఉంది. ఆచరణలో అడుగులు కనీసం ఒక్కటీ కూడా ముందుకు పడలేదు.

అసలు తేగలమా ….?

పద్మ అవార్డులు సైతం అరకొరగా తెలుగు వారికి వస్తున్నాయి. ప్రతిభామూర్తులు ఎంతోమంది వాటి కోసం వేచి చూసి కన్నుమూస్తున్నారు. వారికి కచ్చితంగా పద్మ అవార్డు ఇవ్వాలని జనం అనుకున్నా ఎపుడూ జరగడంలేదు. దానికి కారణం తెలుగు వారి నుంచి సిఫార్సులు పెద్దగా వెళ్లవు. ప్రతీ ఏడాది రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటిస్తారు అంటే దానికి మూడు నెలల ముందు నుంచి కసరత్తు చేసి అర్హులకు ఇప్పించుకునే విషయంలో మన పాలకులు పెద్దగా చొరవ చూపరు అన్న విమర్శలు ఉన్నాయి. దానికి మరో వైపు చూసుకుంటే ఉత్తరాది అభిమానం, దక్షిణాది మీద వివక్ష కూడా అవార్డుల విషయంలో కనిపిస్తుంది. లేకపోతే భారతరత్నగా లతా మంగేష్కర్ ని గుర్తించి బాలమురళీని పక్కన పెట్టడం దారుణమే కదా అన్నది అందరి మాట. ఇక ఇపుడు ఒక్క బాలూకే కాదు చాలా మంది ప్రతిభామూర్తులకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించడంలో చాలా ఆలస్యం అయింది కూడా. ఇకనైనా ప్రతిభకు వేరే కోణాల్లో కొలిచే విధానానికి స్వస్తి పలికి అంతా ముందుకు కదిలితే దివంగతులైన తరువాత అయినా కొందరికి న్యాయం జరుగుతుంది.

Tags:    

Similar News