టీడీపీలో బండారు కధ ముగిసిందా ?

విశాఖ అర్బన్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి పొలిటికల్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని అంటున్నారు. ఆయనకు 2019లో పెందుర్తి టికెట్ దక్కడమే అతి [more]

Update: 2020-12-28 12:30 GMT

విశాఖ అర్బన్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి పొలిటికల్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని అంటున్నారు. ఆయనకు 2019లో పెందుర్తి టికెట్ దక్కడమే అతి పెద్ద లక్ అని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న కారణాన టికెట్ ఇస్తే దాదాపు ముప్పయి వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. దాంతో పాటు యువ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన అదీప్ రాజు దూసుకుపోతూండడంతో ఈ సీనియర్ నేత రాజకీయం అయోమయంలో పడింది. అధినేత చంద్రబాబు సైతం ఇంచార్జి బాధ్యతలు అప్పగించి ఊరుకున్నారు కానీ పార్టీలో పెద్ద పదవులు ఇవ్వక‌పోవడం కూడా ఆయనను మరింతగా బాధిస్తోందిట.

టిక్ పెట్టేసినట్లే …..

వచ్చే ఎన్నికల్లో అయితే వారసులు, లేకపోతే కొత్త వారికి టికెట్లు ఇద్దామని చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీలో స్వీట్ సిక్స్ టీ బ్యాచ్ ని వెనక్కు నెట్టి యూత్ ని పోటీకి పెడితేనే సైకిల్ స్పీడ్ అందుకుంటుందని బాబుకు కచ్చితమైన లెక్కలు ఉన్నాయట. దాంతో మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసిన బండారు సత్యనారాయణమూర్తి విషయంలో చంద్రబాబు ఉదాసీనంగా ఉంటున్నారు అంటున్నారు. ఆయన కుమారుడు అప్పలనాయుడుకు టికెట్ ఇద్దామంటే ఆయన వల్లనే 2019 ఎన్నికల్లో పార్టీ ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు. దాంతో బండారు సత్యనారాయణమూర్తి కుటుంబానికి టిక్ పెట్టేసినట్లే అని పార్టీ వర్గాల సమాచారం.

కేరాఫ్ మామగా…

బండారు సత్యనారాయణమూర్తి మంత్రిగా కొన్నాళ్ళు పనిచేశారు. అది ఈనాటి తరానికి అసలు తెలియదు, ఎందుకంటే రెండు దశాబ్దాల క్రితం నాటి ముచ్చట అది. ఇదిలా ఉంటే బండారు అల్లుడు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహనరావు ఇపుడు పొలిటికల్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి ఉంది. దాంతో బండారు ఎవరూ అంటే రామ్మోహన్నాయుడు మామ అనే పార్టీలో అంటున్నారుట. ఈ రకమైన రిఫరెన్స్ తో సీనియర్ నేత టీడీపీలో కొనసాగడం రాజకీయంగా విషాదమనే చెబుతున్నారు.

పోటీ పెరిగింది…..

ఇక పెందుర్తి టికెట్ రేసులో అపుడే చాలా మంది ముందుకు వస్తున్నారు. వారిలో గతంలో బండారు సత్యనారాయణమూర్తితో పోటీ పడి ఓడిన వైసీపీకి చెందిన మాజీ నేత, ప్రస్తుత టీడీపీ నాయకుడు అయిన గండి బాబ్జీ ముందున్నారు. గవర సామాజికవర్గానికి చెందిన ఆయన దూకుడు రాజకీయం చేస్తారని పేరు. ఆయన గతసారి టికెట్ వదులుకుని బండారు సత్యనారాయణమూర్తి కోసం తెర వెనక పనిచేశారు. దాంతో నాటి హామీ మేరకు 2024 నాటికి గండి బాబ్జీకే టికెట్ ఖాయమని అంటున్నారు. అదే జరిగితే బండారు సత్యనారాయణమూర్తి పొలిటికల్ కెరీర్ కి శాశ్వతంగానే గండి పడిపోయినట్లేనని విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఈ సీనియర్ నేత రాజకీయం ఏ దారి పట్టనుందో.

Tags:    

Similar News