టీడీపీ మీద కన్నేసిన బాలయ్య ?

బాలయ్య అంటే పేరు లాగానే పసి మనసు, ఆయనకు రాజకీయ వ్యూహాలు ఏవీ తెలియవు అని అంటారు. ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. ఇక [more]

Update: 2020-10-17 08:00 GMT

బాలయ్య అంటే పేరు లాగానే పసి మనసు, ఆయనకు రాజకీయ వ్యూహాలు ఏవీ తెలియవు అని అంటారు. ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. ఇక టాలీవుడ్ లో టాప్ స్టార్. తండ్రి ఎన్టీయార్ లెగసీ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఆయన టాలీవుడ్ రాజకీయాల్లోనే ఎక్కడా కనిపించకుండా పోయారని చెబుతారు. నిజానికి శాసించాలనుకుంటే బాలయ్య కంటే తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి ఎవరు ఎక్కువ కారు. బాలయ్యని పక్కన పెట్టి మరీ ఆ మధ్యన సినీ పెద్దలు భేటీ అయ్యారంటేనే ఆయన ఎంతలా గిరి గీసుకుని కూర్చున్నారో అర్ధమవుతుంది.

వారసుడిగా పిలిచినా….

ఇక బాలయ్యను ఎపుడో తన రాజకీయ వారసుడు అంటూ ఎన్టీయార్ ప్రకటించారు. కానీ బాలయ్య దాన్ని లైట్ తీసుకున్నారు. కానీ బావ చంద్రబాబు మాత్రం సీరియస్ గానే తీసుకుని తానే మామకు తగిన అల్లుడు అని పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ఇక పాతికేళ్ళుగా ఏపీ టీడీపీ పగ్గాలను తన దగ్గర ఉంచుకున్న చంద్రబాబు విభజన తరువాత జాతీయ ప్రెసిడెంట్ గా కొత్త పదవి తగిలించుకుని తృప్తి పొందుతున్నారు. ఇక ఏపీ టీడీపీకి ఒక అధ్యక్షుడు కమిటీ అంటూ హడావుడి చేస్తున్నారు. ఎన్ని శాఖలు ఉన్నా కమిటీలు ఉన్నా ప్రాంతీయ పార్టీల్లో ఒకే నాయకుడు ఉంటారు. అందువల్ల చంద్రబాబు రాష్ట్ర కమిటీలు అంటూ ఎన్ని పేర్లు చెప్పినా అది జనాలకే కాదు, టీడీపీ తమ్ముళ్లకు కూడా పట్టని వ్యవహారమే.

ఆసక్తి పెరిగిందా….?

ఇక బావ చంద్రబాబు తన ఉడుం పట్టుతో పార్టీని గుప్పిట పట్టాక బాలయ్యకు మోజు కలిగింది.ఫలితంగా ఎమ్మెల్యేగా మాత్రమే ఉండగలిగారు కానీ కనీసం మంత్రి కాలేకపోయారు. ఇపుడు చూస్తే టీడీపీ మరీ దీనావస్థలో ఉంది. ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడుని నియమించాలని బాబు భావించారు. దానితో పాటు కమిటీని కూడా నియమించారు. కానీ ఆ కమిటీ ప్రకటన బయటకు రాకుండా అడ్డుకున్నది బాలయ్య అని మాట వినిపిస్తోంది. దానికి గల కారణం ముహూర్తాలు మంచిగాలేవని బాబుకు చెప్పడమే. శూన్య మాసం కంటే నిజ ఆశ్వీయుజ మాసంలో కనుక కమిటీని ప్రకటిస్తే విజయాలు వస్తాయని బాలయ్య సూచించారుట. ఇలా బాలయ్య సూచించడం మంచి విషయమే అయినా దాని వెనక బాలయ్య రాజకీయ ఆసక్తి కూడా ఉందని అంటున్నారు.

సీరియస్ గానే..?

ఇక బాలయ్యకు ఇపుడు రాజకీయాల మీద సీరియస్ గానే చూపు ఉందట. తన అభిమానిగా చెప్పుకునే జగన్ సీఎం కావడం కూడా మరో కారణం కావచ్చు. తాను ఇన్నాళ్ళు పార్టీలో ఉండి ఎన్టీయార్ వారసుడు అయి కూడా టీడీపీ ఎందుకిలా అయిందని బాలయ్య మధన పడుతున్నారని టాక్. పైగా బావ విషయంలో ఇన్నాళ్ళూ ఆయన చెప్పినట్లుగానే తలూపిన బావమరిది ఇపుడిపుడే సౌండ్ చేస్తున్నారుట. ఇక తన అల్లుడిని పక్కన పెట్టుకుని టీడీపీలో కీలకం అవుతారని కూడా అంటున్నారు. చంద్రబాబుకు కూడా వయసు అయిపోవడంతో ఇక బాలయ్య లోకేష్ ఇద్దరూ కలసి చక్రం తిప్పుతారని అంటున్నారు. చంద్రబాబు సైతం ఇపుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాలయ్య మాట వినాల్సివస్తుందని కూడా అంటున్నారు. బాలయ్య సీరియస్ గా రాజకీయాల్లోకి దిగితే మాత్రం టీడీపీకి కొత్త బలం రావడం ఖాయమని కూడా అంటున్నారు. మొత్తానికి నందమూరి రక్తంతోనే పసుపు పార్టీకి వెలుగు రేఖలు వస్తాయని అభిమానులు కూడా అంటున్నారు. మరి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బాలయ్య కూడా ఈసారి పార్టీలో ఒక కీలకమైన పదవిని తీసుకుంటారని అంటున్నారు.

Tags:    

Similar News