అయ్యన్న ప‌ట్టా ? బాబు పంత‌మా ?

విశాఖపట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం నియోజకవర్గం పేరు చెప్పగానే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు గుర్తు రావాల్సిందే. ఎన్నో ఏళ్ల నుంచి నర్సిపట్నం నియోజకవర్గానికి అయ్యన్న సేవలు [more]

Update: 2021-06-30 12:30 GMT

విశాఖపట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం నియోజకవర్గం పేరు చెప్పగానే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు గుర్తు రావాల్సిందే. ఎన్నో ఏళ్ల నుంచి నర్సిపట్నం నియోజకవర్గానికి అయ్యన్న సేవలు చేస్తున్నారు. టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి, మధ్యలో వేరే నాయకులు మాదిరిగా పార్టీ మారకుండా నిబద్ధతతో టీడీపీలో కష్టపడుతున్నారు. ఆరు సార్లు నర్సీపట్నం నుంచి గెలిచిన అయ్యన్నపాత్రుడు 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. త‌న శిష్యుడు ఉమా శంక‌ర్ గ‌ణేష్ చేతిలోనే అయ్యన్నపాత్రుడు ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టడానికి చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం దెబ్బకు చాలామంది నాయకులు సైడ్ అయిపోయినా సరే అయ్యన్న.. టీడీపీ తర‌పున పోరాడుతున్నారు. అయితే అయ్యన్న పోరాటానికి ఆయన వారసుడు చింతకాయల విజయ్ మద్ధతుగా కూడా ఎక్కువగానే ఉంది.

అక్కడ పోటీ ఇవ్వగలిగిందంటే?

విజయ్ సైతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తండ్రికి సపోర్ట్‌గా ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇక వీరి కష్టం వల్లే మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తిగా జగన్ వేవ్ ఉన్నా సరే, నర్సీపట్నంలో టీడీపీ కొద్దిగా పోటీలో నిలబడగలిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉంటే వైసీపీ 14 గెలుచుకుంటే, టీడీపీ 12 గెలుచుకుంది, ఇతరులు 2 గెలుచుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ వల్లే నర్సీపట్నంలో టీడీపీ ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగింది. ఇలా టీడీపీకి 12 వార్డులు రావడంలో విజయ్ కష్టం ఎక్కువగానే ఉంది. విజ‌య్‌తో పాటు స‌తీమ‌ణి సైతం కౌన్సెల‌ర్లుగా గెలిచారు. వీరిని ఓడించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉమా శంక‌ర్ ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా విజ‌యం సాధించారు.

ఎంపీ స్థానం నుంచి…?

ఈ విధంగా టీడీపీలో కష్టపడుతున్న విజయ్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లోనే వారసుడుకు టిక్కెట్ ఇప్పించుకోవాలని అయ్యన్నపాత్రుడు చూశారు. కానీ చంద్రబాబు….ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ అని చెప్పడంతో అయ్యన్నపాత్రుడు ఒక్కరే పోటీలోకి దిగారు. న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యేగా ఒక‌రు, అన‌కాప‌ల్లి ఎంపీగా ఒక‌రు పోటీ చేయాల‌నుకున్న చంద్రబాబు ఇష్టప‌డ‌లేదు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో అనకాపల్లి పార్లమెంట్ సీటు ఖాళీగానే ఉంది. దీంతో ఈ ప‌రిస్థితుల్లో చంద్రబాబు త‌మ ఫ్యామిలీకి రెండు సీట్లు ఎందుకు ఇవ్వర‌న్న ధీమా అయ్యన్నపాత్రుడులో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు టిక్కెట్లకు ఛాన్స్ లేక‌పోతే అయ్యన్నపాత్రుడు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని విజయ్‌కు కూడా టిక్కెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రి అయ్యన్న ప‌ట్టు నిలుపుకుంటారా ? లేదా బాబు చెప్పిన‌ట్టే వింటారా ? అన్నది కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News