ఓడిపోయినా తగ్గట్లేదుగా

విశాఖ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు సీనియర్ మోస్ట్ నాయకుడు అనుకుంటున్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీని ఏకత్రాటిమీద నడపకపోగా కొత్త చిచ్చు రాజేస్తున్నారు. వర్గ [more]

Update: 2019-09-28 03:30 GMT

విశాఖ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు సీనియర్ మోస్ట్ నాయకుడు అనుకుంటున్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీని ఏకత్రాటిమీద నడపకపోగా కొత్త చిచ్చు రాజేస్తున్నారు. వర్గ పోరును పెంచేలా అయ్యన్నపాత్రుడు చర్యలు ఉంటున్నాయని అంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా విశాఖ జిల్లా టీడీపీలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు వర్గాలు ఉన్నాయి. అయితే టీడీపీ ఓటమి పాలు కావడంతో గంటా సైలెంట్ అయ్యారు. ఇదే అదనుగా విశాఖ సిటీ రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు బాగానే జోక్యం చేసుకుంటున్నారు. అయితే పెద్ద మనిషిగా పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతగా గ్రూపులకు అతీతంగా వ్యవహరించాల్సిన అయ్యన్నపాత్రుడు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయంత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి.

సిటీ ప్రెసిడెంట్ నే అవమానించేలా..?

విశాఖ అర్బన్ జిల్లా సిటీ ప్రెసిడెంట్ గా గంటా అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రహమాన్ ఉన్నారు. ఇక ఆయనది, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇద్దరిదీ ఒకటే నియోజకవర్గం కావడంతో వర్గ పోరు అగ్గిలా రాజుకుంటూనే ఉంది. రహమాన్ విశాఖ సౌత్ అసెంబ్లీ సీటు కోరుకున్నారు. అయితే వాసుపల్లికి దక్కడంతో ఆయన విజయానికి కృషి చేయలేదని ప్రచారంలో ఉంది. దాంతో స్వల్ప మెజారిటీతో గెలిచిన వాసుపల్లి రహమాన్ మీద గుస్సా అవుతూ వచ్చారు. ఆయన టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నంతవరకూ తాను టీడీపీ మీటింగులకు రానని తెగేసి చెప్పెస్తున్నారు. ఇక తాజాగా జరిగిన పార్టీ సమన్వయ సమావేశానికి సైతం వాసుపల్లి డుమ్మా కొట్టారు. దీనికి తోడు వాసుపల్లి ఏర్పాటు చేసిన మరో కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యుని హోదాలో అయ్యన్నపాత్రుడు హాజరుకావడంపైన రహమాన్ గుర్రుమీదుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అయ్యన్నపాత్రుడు వాసుపల్లి వైఖరిని తప్పుపట్టకుండా ఆయనకు మద్దతుగా నిలవడంపైనా రహమాన్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

బాహాటంగానే ఆరోపణలు….

అసలే పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో అంతా ఒక్కటిగా ఉంటూ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన సందర్భం ఉంది. కానీ దానికి భిన్నంగా పార్టీలోని పెద్దలు వ్యవహరిస్తున్నారని తమ్ముళ్ళు వాపోతున్నారు. మాజీ మంత్రి గంటా వర్గాన్ని అణచివేసేందుకు అయ్యన్నపాత్రుడు వర్గం గట్టిగా ప్రయత్నాలు చేయడంతో ఒకరిపై మరోకరు మీడియా ముఖంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైఖరిని సిటీ ప్రెసిడెంట్ రహమాన్ మీడియా ముఖంగా ఖండించడం విభేదాలకు పరాకాష్టగా చెప్పుకుంటున్నారు. మరో వైపు గంటా బ్యాచ్ ఎలాగైనా పార్టీని వీడిపోతారని అయ్యన్నపాత్రుడు జట్టు అనుమానిస్తోంది. అందువల్లనే వారికి పొగ పెడుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తొంటే ఇప్పటికే చితికిపోయిన టీడీపీని అంతా కలసి ఉసురు తీసేలా ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News