అయ్యన్న వారి అబ్బాయి ఆశలు తీరేనా.. ?

విశాఖపట్నం జిల్లా గురించి రాజకీయంగా ప్రస్థావన వస్తే కచ్చితంగా మాజీ మంత్రి అయ్యనపాత్రుడిని ఎవరైనా తలచుకోవాలంటే. కేవలం 27 ఏళ్ళకే ఎమ్మెల్యే అయి ఆ మీదట మంత్రి [more]

Update: 2021-07-30 05:00 GMT

విశాఖపట్నం జిల్లా గురించి రాజకీయంగా ప్రస్థావన వస్తే కచ్చితంగా మాజీ మంత్రి అయ్యనపాత్రుడిని ఎవరైనా తలచుకోవాలంటే. కేవలం 27 ఏళ్ళకే ఎమ్మెల్యే అయి ఆ మీదట మంత్రి అయిన రికార్డు అయ్యన్నది. పెళ్ళి కాకుండానే అమాత్య కిరీటం నెత్తిన పెట్టుకున్న అయ్యనపాత్రుడు ఇప్పటికి ఆరు సార్లు నర్శీపట్నం నుంచి గెలిచారు. పలు మార్లు మంత్రి పదవిని చేపట్టారు. ఎన్నో కీలకమైన శాఖలను కూడా ఆయన చూశారు. నాడు ఎన్టీఆర్ పిలిచి అయ్యన్నకు టికెట్ ఇచ్చారు. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన అయ్యనపాత్రుడు చంద్రబాబుకు కూడా బాగా ఇష్టుడు. మొత్తానికి బాబుకు నమ్మిన బంటుగా ఉంటూ జిల్లాలో నాలుగు దశాబ్దాల రాజకీయాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు రాజ‌కీయాల‌ను ఏలుతోన్న గంటా శ్రీనివాస‌రావు మొద‌లుకుని ఎంతోమంది అయ్య‌న్న‌కు శిష్యులే..!

తనయుడి కోసం….

ఇపుడు అయ్యనపాత్రుడు ఆరున్నర పదుల వయసులో ఉన్నారు. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయను అన్నారు కానీ చంద్రబాబు మాట మేరకు రంగంలోకి దిగారు. ఇక 2024 ఎన్నికల నాటికి తాను తప్పుకుని తన తనయుడు విజయ్ పాత్రుడిని ఎమ్మెల్యే చేయాలని అయ్యన్న తపన పడుతున్నారు. ఈ రోజుకీ మీడియా ముందు చురుకుగా ఉండే అయ్యనపాత్రుడు రాజకీయంగా మాత్రం రెస్ట్ కావాలని కోరుకుంటున్నారు మరో వైపు చూస్తే విజ‌య్ పాత్రుడు రాజకీయంగా తండ్రి అడుగు జాడలలో నడుస్తున్నారు బాగానే రాటు తేలారు. ఆయన్ని చంద్రబాబు మెచ్చి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. లోకేష్ టీమ్ లో కీలకమైన మెంబర్ గా విజయ్ ఉంటారు. విద్యాధికుడు అయిన విజయ్ ని లోకేష్ కూడా మెచ్చుకుంటారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ…

నర్శీపట్నంలో ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేగా పెట్ల ఉమా శంకర్ గెలిచినా కూడా చుక్కలు చూపించడంలో అయ్యన్న ఫ్యామిలీ ముందుంది నర్శీపట్నం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఢీ అంటే ఢీ కొట్టి దాదాపుగా సగం సీట్లను సాధించిన ఘనత అయ్యనపాత్రుడు కుమారుడు విజయ్‌దే. తల్లి, తమ్ముడిని కూడా కౌన్సిలర్లుగా గెలిపించుకుని తమ పట్టుని నిలుపుకున్నారు. ఇదిలా ఉంటే విజయ్ పాత్రుడికి కేవలం నర్శీపట్నంలోనే కాదు, అనకాపల్లి, మాడుగులలో కూడా బాగానే అనుచర గణం ఉంది. ఆయన ఈ మూడు చోట్ల నుంచి ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిపించుకుంటామని తమ్ముళ్ళు ఎప్పుడూ చెపుతుంటారు.

ఆ సీటే సేఫ్….

అయితే సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా వారికి న‌ర్సీప‌ట్నమే సేఫ్ సీట్‌..! చంద్రబాబు అయ్యన్నే మళ్లీ నిలబడాలని కోరినా కూడా అనకాపల్లి ఎంపీగా నిలిచి గెలిచే సత్తా విజయ్ కి ఉందని అంటారు. మొత్తానికి తండ్రి లాగే దూకుడు రాజకీయం చేయడంతో పాటు వ్యూహాలను రూపొందించడంతో విజయ్ దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. మరి అయ్యనపాత్రుడు అబ్బాయి ఆశలు తీరాలంటే 2024 ఎన్నికలు రావాల్సిందే.

Tags:    

Similar News