సీన్ అర్ధమై సీల్ వేసుకున్నారా.. ?

దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి పదవులకు డెడ్ లైన్లు విధించిన ఘనత జగన్ ది. దాని వల్ల మొదట్లో ఎలా ఉన్నా గడువు దగ్గరపడుతున్న కొద్దీ [more]

Update: 2021-07-12 03:30 GMT

దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి పదవులకు డెడ్ లైన్లు విధించిన ఘనత జగన్ ది. దాని వల్ల మొదట్లో ఎలా ఉన్నా గడువు దగ్గరపడుతున్న కొద్దీ మంత్రులలో తెగ టెన్షన్ పెరిగిపోతోంది. రెండున్నరేళ్ల తరువాత మీ పదవులు ఉండవు అంటూ జగన్ గతంలో చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఆరు నెలల ముందు నుంచే కాళ్ళు బార్ల జాపే వారి జాబితా కూడా ఎక్కువ అయిపోతోంది. నిజానికి మంత్రి వర్గ విస్తరణ అన్నది చివరి క్షణం వరకూ తెలియదు, తెలిసి పదవి పోయిన తరువాత కధ వేరు. ముందే ఫలనా రోజు చస్తావ్ అని చెబితే ఎంతటి ధైర్యవంతుడు అయినా బతికినన్నాళ్ళో రోజుకు వంద సార్లు చస్తాడు. వైసీపీలో మెజారిటీ మంత్రులు ఇపుడు యాక్టివ్ గా లేకపోవడానికి ఈ డెడ్ లైన్ కారణం అంటున్నారు. అందులో అవంతి శ్రీనివాసరావు ఒకరు.

అన్నీ కట్ ….

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇపుడు అన్నీ కట్ చేసుకుని ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఆ మధ్య వరకూ ఆయన చంద్రబాబు మీద లోకేష్ మీద తెగ విరుచుకుపడేవారు. ప్రత్యర్ధుల మీద ఘాటు విమర్శలు దట్టించేవారు. అయిదేళ్ల మంత్రిని తానేనన్న తీరులో వీర విహారం చేసేవారు. అలాంటాయన ఇపుడు అవంతి శ్రీనివాసరావు గమ్మున ఉంటున్నారు. తన శాఖకు సంబంధించి కూడా యాక్టివిటీస్ ని అసలు పట్టించుకోవడం లేదుట. మరికొద్ది నెలల్లో పోయే పదవి విషయంలో ఎందుకీ వ్యామోహం అన్నట్లుగా అవంతి ఉంటున్నారుట.

లీక్ అయిందా …?

మంత్రివర్గంలో ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వెళ్తారు అన్న దాని మీద సమాచారం లీక్ అయినందువల్లనే పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటనలు మానుకున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయిదేళ్ళ మంత్రిగా అవంతి శ్రీనివాసరావుని కొనసాగించరు అన్న న్యూస్ అయితే పార్టీలో వినిపిస్తోంది. సొంత నియోజకవర్గం భీమిలీలో రాజకీయంగా అవంతి శ్రీనివాసరావు పట్టు సాధించలేకపోయారు అంటున్నారు. అలాగే ఆయన శాఖాపరంగానూ ఏ మాత్రం పాస్ మార్కులు సంపాదించలేదని కూడా చెబుతున్నారు. విశాఖ వంటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన సిటీలో అవంతి శ్రీనివాసరావు గట్టిగా ఫోకస్ కాలేకపోయారు అన్నది కూడా సీఎం కి చేరిన నివేదికలో ఉందిట.

లేఖలతో సరిపుచ్చుతున్నారు …

జగన్ మంత్రివర్గంలో ఆయన సభ్యుడు. ఏ సమస్య ఉన్నా నేరుగా సీఎం తో చర్చించి సాధించే కెపాసిటీ ఉన్న మంత్రి. అలాంటిది విపక్ష నాయకులు మాదిరిగా లేఖలు రాయడమేంటన్నదే ఇపుడు విశాఖలో సాగుతున్న చర్చ. కళాకారులను ఆదుకోవాలని కోరుతూ ఈ మధ్యన అవంతి శ్రీనివాసరావు జగన్ కి లేఖ రాశారు. దాన్ని చూసి చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా లేఖ రాస్తే ఏమనుకోవాలని కూడా అంటున్నారు. దీన్ని బట్టి అర్ధం అయింది ఏంటి అంటే అవంతి శ్రీనివాసరావు త్వరలోనే మాజీ కాబోతున్నానని అంటున్నారు. లేకపోతే తన శాఖకు సంబంధించిన విషయంలో కూడా సీఎం కి లేఖ రాసి పరిష్కరించండని కోరడమేంటి అంటున్నారు. మొత్తానికి అవంతి శ్రీనివాసరావుకి సీన్ అర్ధమై నోటికి సీల్ వేసుకుంటున్నారు అని సొంత పార్టీలో ప్రత్యర్ధులతో పాటు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News